చెంచుమహిళపై అమానుష దాడి.. అక్రమంగా నిర్భంధించి చిత్రహింసలు

చెంచుమహిళను దారుణ చిత్రహింసల పాలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లిలో ఓ చెంచు మహిళపై ఇద్దరు విచణారహితంగా దాడి చేశారు

చెంచుమహిళపై అమానుష దాడి.. అక్రమంగా నిర్భంధించి చిత్రహింసలు

చెంచుమహిళపై అమానుష దాడి
అక్రమంగా నిర్భంధించి చిత్రహింసలు
నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి జూపల్లి

విధాత, హైదరాబాద్‌ : చెంచుమహిళను దారుణ చిత్రహింసల పాలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లిలో ఓ చెంచు మహిళపై ఇద్దరు విచణారహితంగా దాడి చేశారు. వివస్త్రను చేసి, కళ్లు, మర్మాంగాల్లో కారం పూసి పదిరోజుల పాటు ఇంట్లో నిర్భంధించి హింసించారు. బాధితురాలు ఈశ్వరమ్మ, ఆమె భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలంలోనే వారిద్దరు కూలీ పని చేస్తున్నారు. ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో ఈశ్వరమ్మ తన తల్లిగారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంకటేశ్‌.. తల్లిగారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. తన భార్య శివమ్మ, బాధితురాలి బంధువు లక్ష్మమ్మ, ఆమె భర్త లింగస్వామితో కలిసి వెంకటేశ్ అమానుషంగా ఈశ్వరమ్మపై దాడి చేశాడు.

అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే ఉంచి గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీతో వైద్యం అందించారు. అయితే విషయం తెలుసుకున్న ఈదన్న.. గ్రామస్థులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేశ్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొని రాగా దాష్టీకం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న నేషనల్‌ ఆదివాసి లిబర్టీ కౌన్సిల్‌ సంస్థ (ఎన్‌ఏఎస్‌సీ) సభ్యులు బుధవారం ఆమె ఇంటికి వెళ్లగా జరిగిన విషయం వారికి చెప్పింది. దీంతో వారు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ ఆదేశాలతో ఎస్‌ఐ రిషికేశ్‌, జిల్లా సఖి కేంద్రం నుంచి సరిత, అనిత గ్రామానికి వెళ్లి విచారించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌ దవాఖానకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు సఖి సభ్యులు తెలిపారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి : మంత్రి జూపల్లి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతపల్లిలో చెంచు మహిళపై జరిగిన అమానవీయ దాడిపై ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. బాధిత మహిళలకు అండగా ఉంటామన్నారు. జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి కేసు పురోగతిని తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.