more job placements । తెలంగాణలో గత పదేళ్ల కాలంలో నిరుద్యోగం పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 35 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. బుధవారం ఉదయం మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూ ఆడిటోరియంలో రాష్ట్రంలోని 38 కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 2లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిభ ఉన్నా… నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అందుకే ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి, నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టిందని వివరించారు. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారని, కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించిన తగిన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని సీఎం అన్నారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐతో మాట్లాడామని, బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారంటూ వారిని అభినందించారు. ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారని చెప్పారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయ, డ్రగ్స్కు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి వంటివాటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజినీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయమని హెచ్చరించారు. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలని అభిలషించారు. ప్రపంచ వేదికపై హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలబెట్టాలంటే మీ అందరి సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటివారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామన్నారు.