Group-2 | 18న గ్రూప్-2 అభ్యర్థులకు నియామక పత్రాలు
Group-2 | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.

అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎస్ రామకృష్ణారావు వెల్లడి
Group-2 | విధాత, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 18 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సచివాలయంలో మంగళవారం సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రూప్-2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందిస్తారని తెలిపారు. వీరిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారన్నారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటల లోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నియామకాల్లో అత్యధికంగా సాధారణ పరిపాలన, రెవెన్యూ, వాణిజ్య పన్నుల, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నందున, రెవెన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, రిజ్వి, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.