Former CM Rosaiah । ఆర్యవైశ్యులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందన్న రేవంత్రెడ్డి.. ఆర్యవైశ్యులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలని పిలుపునిచ్చారు. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని తెలిపారు.

Former CM Rosaiah । ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి’ అని తనకు గతంలో రోశయ్య సూచించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3 వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య తమకు ఇచ్చారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడిందని ముఖ్యమంత్రి చెప్పారు. ‘చుక్క రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, రోశయ్య లాంటి వారి మధ్య శాసనమండలిలో ఎమ్మెల్సీగా మాట్లాడేందుకు నేను భయపడ్డాను. నీటిపారుదల శాఖపై మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన చాంబర్కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికీ మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.. పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి.. ఇదే రోశయ్య మాట రోశయ్య నాకు సూచించారు’ అని చెప్పారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడిందని, ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయని అన్నారు. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదన్న రేవంత్రెడ్డి.. సీఎంగా, గవర్నర్గా వివిధ హోదాల్లో 50 యేళ్లకు పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారని నివాళులర్పించారు. ‘తమిళనాడు గవర్నర్గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు..కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. అనాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహరించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు. రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు.’ అని అన్నారు.
ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారని రేవంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారని, ముఖ్యమంత్రి స్థానం కోసం ఏనాడూ రోశయ్య తాపత్రయపడలేదని చెప్పారు. పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారని అన్నారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయని చెప్పారు. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర ఆయన బలంగా వేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉందన్న రేవంత్రెడ్డి.. ఆర్యవైశ్యులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలని పిలుపునిచ్చారు. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుందని తెలిపారు. రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తాను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.