కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు
విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొట్టిపారేశారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ఒకే స్వరాన్ని విన్పిస్తూ ప్రజల్లో భయందోళనలను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుంది… ఈ మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఇదే విషయంపై బీజేపీ పక్షాన నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా.. డేట్, టైం, వేదిక మీరే ఫిక్స్ చేయండి. అదే సమయంలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన, సుప్రీం తీర్పుకు వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా?’’అని సీఎం, కేటీఆర్ లకు ఆయన సవాల్ విసిరారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై ప్రజల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
తాను అవినీతిపరుడంటూ కేటీఆర్, పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ‘‘నేను అవినీతికి పాల్పడితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా… నాపై ఎందుకు చర్యలు తీసుకోలే? ఎందుకు ఆధారాలు చూపలే. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకినవ్. మీ ఆస్తిపాస్తులపై, నా ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా? నేను రడీ… అట్లాగే అవినీతి, ఆస్తులపై దేవుడి ముందు ప్రమాణం చేసేందుకు సిద్దమా?..’’అంటూ సవాల్ విసిరారు.
సోమవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం కావడానికి ప్రధాన కారణం కేటీఆర్. జనం ఛీ కొట్టినా ఆయనకు అహంకారం తగ్గలేదు. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు. అమెరికాలో చిప్పలు కడిగిన బతుకు నీది. మీ అయ్య లేకపోతే… నిన్ను కుక్కలు కూడా దేకవు. అమెరికాలో రబ్బరు చెప్పులు, ముడతల చొక్కతో తిరిగే నువ్వు మీ అయ్య టీఆర్ఎస్ పెడితే వచ్చి సిరిసిల్ల టిక్కెట్ పై పోటీ చేసి కేకే మహేందర్ రెడ్డి పొట్ట కొట్టిన నీచుడివి. అధికారంలో ఉంటూ కేటీఆర్ చేసిన అవినీతి, అక్రమాల చిట్టాతోపాటు ఆయన భాగోతమంతా బయటకు తీస్తున్నా. త్వరలోనే ప్రజల ముందు పెడతా అన్నారు.
నేను మా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు.. 1994లో ఆ తర్వాత అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా గెలిచిన.2005 నుండి రెండు సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచిన. 2014, 18లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 2019లో ఎంపీగా పోటీ చేసి 89 వేలకుపైగా మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తనవి గాలి తిరుగుళ్ళు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. మీ లెక్క గాలి మాటలు చెప్పి వేల కోట్లు దోచుకోవడం నాకు తెల్వదు. మీ చెల్లి లెక్క గాలి మాటలు చెప్పి పంజాబ్, ఢిల్లీలో లిక్కర్ దందాలు చేయడం తెలవదని అన్నారు.
అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయి అల్లాడుతుంటే అధికారంలో ఉండి కేసీఆర్ నయాపైసా ఇయ్యకపోతే, వాళ్లకు అండగ నిలిచా… రుణమాఫీ చేయకపోతే, వడ్లు కొనకపోతే రైతుల పక్షాన పోరాడా అని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా రోడ్డునపడేస్తే వాళ్ల పక్షాన కొట్లాడి జైలుకు పోయా… 317 జీవో సవరించాలని ఉద్యోగులు రోడ్డున పడితే వాళ్ల పక్షాన ధర్నాలు చేసి జైలుకు పోయిన… ప్రజా సమస్యలపై పోరాటంలో లాఠీదెబ్బలు తిన్నా, వందల కేసులు పెట్టినా వెరవకుండా పోరాడిన. మీ దృష్టిలో ఇవన్నీ గాలి తిరుగుళ్లా? ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రశ్నించిన వాళ్లను రాచిరంపాన పెట్టి మీరు మాత్రం విదేశాలకు వెళ్లి వేల కోట్లు దాచి పెట్టుకోవడం మంచి తిరుగుళ్లా?.. అని నిలదీశారు. జనం గద్దె దించి మీ కుటుంబాన్ని ఛీ కొట్టినా ఇంకా టిఆర్ఎస్ నేతలకు బుద్దిరాలేదని, జూన్ 4 తరువాత జనం బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కబోతున్నరని, అప్పుడైనా వారు బుద్ది తెచ్చుకుంటారని భావిస్తున్నానన్నారు.