Telangana Budget | కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శాసనసభ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి మండలి సమావేశమై బడ్జెట్ 2026-27కు ఆమోదం తెలపనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టి, చదివి వినిపించనున్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఉభయసభలు సోమవారానికి వాయిదా పడనున్నాయి.
2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దు సుమారు రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. గత బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించిన ప్రభుత్వం ఈసారి దానిపై 8-10% వరకు అదనంగా పెంచి రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లుగా చూపనుందని సమాచారం.
ఈ మూడు రంగాలపైనే దృష్టి..!
ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి రంగాలపై అధికంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ మూడు రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ సంక్షేమ రంగంలో ఇస్తున్న రాయితీల్లో… విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ శాఖలకు భారీగా ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా 30 లక్షల వ్యవసాయ బోర్లకు, 50 లక్షల గృహజ్యోతి పథకం ఇళ్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడానికి రూ.20 వేల కోట్లు కావాలని డిస్కంలు అడిగాయి. గత బడ్జెట్లో రూ.14 వేల కోట్లు ఇచ్చినా సరిపోలేదు. ఈ క్రమంలో ఈ రంగానికి ఈసారి బడ్జెట్ కేటాయింపులు అధికంగా ఉండే అవకాశం ఉంది.
