విధాత ప్రతినిధి, నిజామాబాద్: బీఆరెస్ పాలనలో పేదల అభ్యున్నతిని విస్మరించారని, సంక్షేమ పథకాలనూ డబ్బుకు అమ్ముకున్నారని రాష్ట్ర పీసీసీ కోశాధికారి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి పీ సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట కేంద్రంలో బుధవారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రతి స్కీంలో అవినీతి చోటు చేసుకుందని, పథకాలన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే అందించారని మండిపడ్డారు. పదేళ్లలో బోధన్ నియోజకవర్గం అనేక రంగాల్లో వెనుకబడిందని అన్నారు. భూకబ్జాలు, సంక్షేమ పథకాల్లో అవినీతి, పాలనలో జవాబుదారితనం లోపించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనరంజక పాలనను అందిస్తామని తెలిపారు.
ఆరు గ్యారెంటీలను 90 రోజుల్లో అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. ఈనెల 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ బస్సుయాత్ర ఉంటుందని తెలిపారు. కమ్మర్ పల్లి , మోర్తాడ్ లో సైడ్ మీటింగ్ తర్వాత ఆర్మూర్ లో పాదయాత్ర చేపట్టి, నిజామాబాద్ నెహ్రూ పార్క్ వద్ద సాయంత్రం సభ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సుదర్శన్ సమక్షంలో వివిధ పార్టీల నాయకులు భారీఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.