EC Meeting With Political Parties | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…రాజకీయ పక్షాలతో ఈసీ భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్త ఎన్నికల సంస్కరణలతో ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

విధాత: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ, మజ్లిస్(ఎంఐఎం) తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించబడనున్నట్లు వెల్లడించారు. ఈ సంస్కరణలు మొదట బీహార్.. ఆపై దేశవ్యాప్తంగా జరగనున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు చేసుకోవాలని సూచించారు.