నిరుద్యోగ జేఏసీ, బీఆరెస్వీ చేపట్టిన టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడే సాగించిన అరెస్టులతో భగ్నం చేశారు
బీఆరెస్వీ, బీజేవైఎం, నిరుద్యోగ జేఏసీ నేతల అరెస్టు
ఖండించిన బీఆరెస్ ప్రముఖులు
విధాత, హైదరాబాద్ :నిరుద్యోగ జేఏసీ, బీజేవైఎం, బీఆరెస్వీ చేపట్టిన టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడే సాగించిన అరెస్టులతో భగ్నం చేశారు. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. జిల్లాల నుంచి నిరుద్యోగులు ఎవరు రాకుండా కట్టడి చేసిన పోలీస్ యంత్రాంగం టీజీపీఎస్సీ కార్యాలయం వైపు వేళ్లే మార్గాల్లో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించి అటుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారందరిని అదుపులోకి తీసుకుంది. టీజీపీఎస్సీ ముట్టడికి మద్దతు ప్రకటించి, బయల్దేరిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సహా విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
టీజీఎస్పీసీని వద్ద ఆందోళన చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను, బీజేవైఎం కార్యకర్తలను, నాయకులను కూడా అరెస్టు చేశారు. 30 లక్షల మందితో ‘నిరుద్యోగుల మార్చ్’ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. అయితే నిరుద్యోగలు మార్చ్ను ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకోవడం సఫలీకృమైంది. జిల్లాల నుంచి యువతను రాజధానికి రాకుండా అడ్డుకుంది. హైదరాబాద్ చుట్టూ పికెటింగ్లు ఏర్పాటుచేసింది. జిల్లాల నుంచి వస్తున్న ప్రతివాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆందోళనకారులుగా భావించిన వారిని అరెస్టు చేసింది. అటు నిరుద్యోగులకు మద్ధతుగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ చేపట్టిన ఆమరణ దీక్ష 3వ రోజుకు చేరుకోగా పలువురు విద్యార్థులు, నిరుద్యోగులు ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు.
అరెస్టులను ఖండించిన బీఆరెస్ నేతలు:
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు, తమ డిమాండ్ల సాధనకు టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ, నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు. “అప్రజాస్వామ్యపాలన అని, ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు.
ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రధాన ప్రతిపక్షమైన బిఆరెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టమని, విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామని, నిర్విరామ పోరాటం చేస్తామని తెలిపారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
విద్యార్థి నాయకుల అరెస్టు దుర్మార్గం : కేటీఆర్
ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్లలోని సమస్యలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాల పైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమని బీఆరెస్ వర్కింగ్ ప్రెసెడింట్ కేటీఆర్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఎన్నికల ముందు ఇదే నిరుద్యోగులతో స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీతో మూలాఖాత్లు ఏర్పాటు చేయించి, అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేశారని, ప్రభుత్వంలోకి రాగానే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. కేవలం ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకొని ఈరోజు వారు డిమాండ్ చేస్తున్న న్యాయమైన అంశాలపైన కూడా నోరు మెదపడం లేదన్నారు.
ప్రజా పాలన పేరును పదేపదే వల్లే వేసే కాంగ్రెస్ సర్కార్ జమానాలో యువకులకు, విద్యార్థులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ క్యాలెండర్ తేదీల గడువు అయిపోయిందని, వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆరెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు అరెస్టు చేసిన విద్యార్థి నాయకులు నిరుద్యోగులు విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తలుగుతుంది: నిరంజన్రెడ్డి
తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని విమర్శించారు. ప్రగతి భవన్ కంచెలు బద్దలుకొట్టామని ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు హైదరాబాద్ నగరమంతా కంచెలు పాతుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి వాడుకున్నారని విమర్శించారు. అధికారం చేతికి చిక్కాక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆరెస్ ప్రభుత్వంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా ఒక్క పోస్టూ పెంచలేదన్నారు. గతంలో ఇదే నోటిఫికేషన్ను కుట్రపూరితంగా అడ్డుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నిరుద్యోగులందరినీ విడుదల చేయాలన్నారు.