పాలమూరు లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్లమెంటులో గళం విప్పి నిధులు రాబట్టారు... ఇక్కడ ఉన్న సమస్యలపై 356 ప్రశ్నలు సంధించి పాలమూరు వాణి వినిపించారు. పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడగటమే కాకుండా.. సమావేశాలకు 68 శాతం హాజరై సభ్యులకు మార్గదర్శి అయ్యారు.. ఆయనే మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి.
కేసీఆర్ చేసిన అభివృద్ధే ప్రచారాంశం
లక్ష మెజారిటీతో గెలుస్తున్నాం
కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మిన ప్రజలు
ఇప్పుడు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు
బురదజల్లి ఓట్లు రాబట్టుకునే యత్నంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
గెలిస్తే మళ్ళీ సాగునీటిపై దృష్టి సారిస్తా
‘విధాత’తో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరు లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్లమెంటులో గళం విప్పి నిధులు రాబట్టారు… ఇక్కడ ఉన్న సమస్యలపై 356 ప్రశ్నలు సంధించి పాలమూరు వాణి వినిపించారు. పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడగటమే కాకుండా.. సమావేశాలకు 68 శాతం హాజరై సభ్యులకు మార్గదర్శి అయ్యారు.. ఆయనే మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి. ఎంపీగా ఈ ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయని, మళ్ళీ పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే మరింత అభ్యర్థి చేస్తానని అంటున్నారు. ఈ మేరకు విధాతకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన, పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పైనే అధికంగా ఫోకస్ పెట్టాం. ఏడు నియోజకవర్గాల్లో మా పార్టీ మాజీ ఎమ్మెల్యేల అండతో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తున్నాం.
ఎంపీగా ఉన్న ఈ ఐదేళ్లు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. సుమారు రూ.778 కోట్ల నిధులు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కలిపించాను. కొన్ని మండలాల్లో గ్రామాలకు వెళ్లే రోడ్లు కంకర తేలడంతో ప్రయాణంలో ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాటిని తారురోడ్లుగా మార్చడానికి నిధులు ఇచ్చాను.
పెండింగ్లో ఉన్న కాచిగూడ – మహబూబ్ నగర్ డబుల్ లైన్ పనులు పూర్తిచేయాలని లోక్సభలో అడిగాను. కేంద్రం స్పందించి ఈ డబుల్ లైన్ పనులు పూర్తి చేసింది. 30 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న దేవరకద్ర – కృష్ణ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయించి పూర్తి చేయించా. మహబూబ్ నగర్, దేవరకద్రలో ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించడంలో కృషి చేశా. జిల్లాలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణ కోసం నిధులు కేటాయించేందుకు కేంద్రాన్ని ఒప్పించి వాటి పనులు పూర్తి చేయించాను.
ప్రధానంగా మహబూబ్ నగర్ – చించోలి అంతర్ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారికి మార్చడం కోసం కేంద్రాన్ని ఒప్పించా. ఈ రహదారుల వెంట ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించా. అలాగే జాతీయ రహదారుల డివిజన్ కార్యాలయం పాలమూరులో ఏర్పాటు చేయించాను.
ఐదేళ్ల నా హయాంలో మా పార్టీ మంత్రి, ఎమ్మెల్యేల భాగస్వామ్యంతో ఎంపీ లాడ్స్తో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. పాలమూరులోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమైంది. మెడికల్ కళాశాల, నూతన కరెక్టరేట్ భవనం, పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.వంద కోట్ల నిధులు, స్టేడియం గదుల నిర్మాణం, హిందూ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ ఖర్చు చేశా. పాలమూరులో పచ్చదనం వెల్లివిరియాలని నిధులు కేటాయించా.
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సత్వరమే వైద్య సేవలు అందించేందుకు ఎంఎస్ఎన్ ఫౌండేషన్ ద్వారా ఏడు అంబులెన్సులను ఉచితంగా అందజేశాము. కరోనా సమయంలో పేదల కోసం ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారిని ఆదుకున్నాం. ఎందరో యువతకు ఉపాధి కల్పిస్తున్నాము. మున్ముందు ఫౌండేషన్ ద్వారా మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
కేసీఆర్ హయాంలో రైతులకు సాగునీరు అందించి ఆదుకున్నారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సాగునీరు అందివ్వక ఈ రబీ పంటలు చాలా ప్రాంతాల్లో ఎండి పోయి రైతుల ఆత్మహత్యలకు దారి తీశాయి. నేను గెలిస్తే మళ్ళీ సాగునీటిపై దృష్టి సారిస్తా. కరెంట్ సక్రమంగా సరఫరా లేక రైతులు నానా కష్టాలు పడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మిన ప్రజలు ఇప్పుడు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యం అనే విషయం ఓటర్లకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేస్తున్నాం. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలపై ప్రజల్లో వివరిస్తున్నాం. నేను మళ్ళీ గెలిస్తే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళుతానని ప్రజలకు వివరిస్తున్నా.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కల్లబొల్లి మాటలు చెప్పి, ఇతరులపై బురద చల్లి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. నీతి, నిజాయతో అభివృద్ధి చేస్తున్న నాపై విమర్శలు చేస్తే జిల్లా ప్రజలు ఎవ్వరూ నమ్మరు. నాపై విమర్శలు చేసే వారిపై నేను విమర్శలు చేయను. అది వారి విజ్ఞతకే వదిలేస్తా. పాలమూరు అభివృద్ధి కోసం పార్లమెంట్ సమావేశాలకు 68 శాతం హాజరై 356 ప్రశ్నలు సంధించాను. సమస్యలపై పార్లమెంటులో గళం ఎత్తి కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చా. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పార్లమెంట్లో మాట్లాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాను. కేంద్ర మంత్రులను కలిసి పాలమూరు అభివృద్ధి కోసం నిధులు మంజూరుకు కృషి చేశా. ఇంత చేసిన నాపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనించి, బీఆరెస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ విజయం సాధిస్తే ప్రజల మధ్య ఉంటూ పాలమూరు అభివృద్ధి కి కృషి చేస్తా.