Harish Rao | మంత్రి వెంకట్‌రెడ్డికి మతి భ్రమించింది.. డాక్టర్‌కు చూపించుకో: హరీశ్‌రావు

నేను అమెరికాకు వెళ్లినట్లు.. ఫోన్ ట్యాపింగ్ నిందితుతు ప్రభాకర్‌రావును కలిసినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు మతిభ్రమించిందనిపిస్తుందని, ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో ఘాటుగా కౌంటర్ వేశారు

  • Publish Date - June 2, 2024 / 05:45 PM IST

నేను ప్రభాకర్‌రావును కలసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా
లేదంటే నీవు ముక్కు నేలకు రాయాలి
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ప్రతి సవాల్‌

విధాత, హైదరాబాద్: నేను అమెరికాకు వెళ్లినట్లు.. ఫోన్ ట్యాపింగ్ నిందితుతు ప్రభాకర్‌రావును కలిసినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు మతిభ్రమించిందనిపిస్తుందని, ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో ఘాటుగా కౌంటర్ వేశారు. నేను అమెరికా వెళ్లి, ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధమని ప్రతి సవాల్ చేశారు.

సీఎం, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది వాస్తవమని, అయితే నేను అమెరికా వెళ్లినట్టు, ప్రభాకర్ రావును కలిసినట్టు ఈరోజు మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారని, అది రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. నేను ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నానన్న తదితర వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తానని, పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని, కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని మండిపడ్డారు. కోమటిరెడ్డి గారి దగ్గర ఉన్న వివరాలతో రుజువు చేయాలని, ఆధారాలతో రావాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కోన్నారు. ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పాలని,అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు.

కోమటిరెడ్డి చెప్పిన తేదీన, చెప్పిన టైంకి అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తానని, ఆయన కూడా ఆధారాలతో రావాలన్నారు. టీవీల్లో బ్రేకింగ్ స్క్రోలింగ్‌ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. నిరాధార నిందలు వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకునే చౌకబారు ప్రయత్నాలు మానుకొని కోమటిరెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవాలని సూచించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండని, ఆ భగవంతుడు మీకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.

Latest News