మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఎందుకు ఎత్తి పోయడంలేదని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి నిలదీశారు.
ఆయకట్టు రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులు
మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మండిపాటు
ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీత
విధాత, హైదరాబాద్ : మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నా ప్రభుత్వం ఎందుకు ఎత్తి పోయడంలేదని మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి నిలదీశారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కాల్వలకు నీటిని ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. గోదావరి ఆయకట్టుకు నీళ్ళందించే అవకాశం ఉన్నా రైతుల పట్ల కక్ష్య పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. గోదావరి నీళ్ళు వృధాగా పోనీయకుండా తక్షణమే సాగు , తాగు నీరు అందించాలన్నారు. యాసంగిలా ఈ సారి కూడా రైతులను ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సాగుకు సిద్ధమైన రైతులకు వెంటనే సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. గతంతో ఈ సమయానికి కేసీఆర్ నీళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం బటన్ నొక్కి నీటిని పంపింగ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం కొట్టుకుపోతది అని దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు మేడిగడ్డలో సాగుతున్న జలప్రవాహంతో ప్రభుత్వం నాలుక కరుచుకుందన్నారు. వ్యవసాయం, సాగునీరు పై సీఎం రేవంత్ రెడ్డి సహా ఎవ్వరికీ అవగాహన లేదన్నారు. హామీలు అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఉచిత బస్సుల సంఖ్యను కుదించారని మహిళలు శపిస్తున్నారని, విద్యుత్తు అధికారుల పై నెపం పెట్టి కరెంట్ కోతల నుండి తప్పించుకోవాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఒక జోక్ లా కనిపిస్తుందని, మాఫీ వివరాల పై స్పష్టతలేదని, అన్నదాతలు ఆందోళన పడుతున్నారన్నారు. రుణ మాఫీ పై వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురవుతున్నారని, రుణమాఫీ పై మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని జగదీశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకువడంలేదని ఆరోపించారు.