ఈ నగరానికేమైందీ? అంటూ ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంటులో వేస్తున్న ప్రశ్నతీరుగా నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆరెస్ )కు ఒక్క ఓటమితో ఏమైందీ?
ఆశ్చర్యంతో పాటు అనుమానం
పార్టీ ముందస్తు ప్రణాళికనా?
ఊహించని పరిణామామా?
చేష్టలుడిగిన ముఖ్య నాయకులు
కేడర్ లో వ్యక్తమవుతున్న నిరాశ
ఎక్కడకానరాని కేసీఆర్ మార్కు
విధాత ప్రత్యేక ప్రతినిధి: ఈ నగరానికేమైందీ? అంటూ ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంటులో వేస్తున్న ప్రశ్నతీరుగా నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆరెస్ )కు ఒక్క ఓటమితో ఏమైందీ? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీనీ, కేడర్ ను నిలబెట్టుకునేందుకు పరీక్షగా మారిన ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ నాయకులు చేష్టలుడిగి వ్యవహరిస్తున్నారు. ప్రేక్షపాత్రవహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దేశంలోనే బలమైన పార్టీగా చెప్పుకున్న ఆ పార్టీకి ఒక్క ఓటమితో ఇప్పుడు ఏమైందనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ కూడా ఎన్నికలను ఎదుర్కోవడంలో కేసీఆర్ మార్కు కొంచెం కనిపించడంలేదంటున్నారు.
నాయకత్వ తీరుపై అనుమానం
గత ఎన్నికలకు ఈ ఎన్నికలకూ బీఆరెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో బరిలో నిలువలేదా? ముందస్తు ప్రణాళికతో ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదా? లేకుంటే నాయకత్వం ప్రయత్నించినా పరిస్థితులు తమ చేతుల్లో లేకుండా పోయాయా? ఇంకమైనా లోపాయకారి ‘ఒప్పందం’ ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బీఆరెస్ పార్టీయేనా? ఈ ఎన్నికలను ఈ విధంగా ఎదుర్కొంటుందీ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యనేతలొచ్చినప్పుడే హడావిడీ
బీఆరెస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎన్నికల సందర్భంగా వచ్చినపుడు మాత్రమే హడావిడీ కనిపిస్తోందీ. ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. ఎన్నికలకు ముందుగా అన్ని జిల్లాల ముఖ్యనాయకులతో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్, హరీష్ రావు రివ్యూ పేరుతో సమావేశాలు జరిపారు. తర్వాత నియోజకవర్గాలను చుట్టేశారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహించారు. తుంటి ఎముక విరిగినప్పటికీ కేసీఆర్ చాలాకాలానికి కర్ర సహాయంతోనైనా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టారు. దీనికి ముందు నల్లగొండ, చేవెల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో తనదైన పద్ధతిలో భారీ సభలు నిర్వహించారు.
రైతుల పొలాలను సందర్శించారు. ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర ద్వార ప్రజల వద్దకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. జిల్లాల్లోనే బసచేశారు. కేసీఆర్ యాత్ర సాగిన రోజుల్లో పార్టీ నాయకులు, కేడర్ అక్కడ భారీగానే భాగస్వామ్యమయ్యారు. కానీ, యాత్రతో పాటే తమ కార్యకలాపాలకు, ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. 17 స్థానాల్లో పోటీచేస్తున్నప్పటీకీ చాలా చోట్ల అంటీముట్టనట్లు నాయకులు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలను కలువడం కంటే కార్నర్ మీటింగుల పేరుతో మొక్కుబడి మీటింగులు నిర్వహిస్తున్నారు.
హంగులన్నీ ఉన్నా ఎందుకీ డీలా?
సర్వహంగులున్న బీఆరెస్ పార్టీకి ఒక్కసారిగా ఈ పరిస్థితి తలెత్తడమేంటనే ఆశ్చర్యం, అనుమానం వ్యక్తమవుతోంది. పద్నాగేళ్ళ రాష్ట్ర సాధన ఉద్యమం, పదేండ్లు రాష్ట్రంలో అధికారం చెలాయించి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలూ, వ్యూహాలు రచించిన పార్టీ, అన్ని రకాల అనుభవాలతో ఆరితేరిన కేసీఆర్ నాయకత్వం, ఆర్ధికపరంగా, కేడర్ పరంగా బలమైన పార్టీగా గుర్తింపుపొందిన పార్టీ ఇంతగా డీలా పడిపోవడం ఇప్పుడు రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి లోనుచేస్తోందీ. ఏ ఎన్నికల వ్యూహకర్త అవసరం లేకుండా తానే ఒక పెద్ద వ్యూహకర్తగా గుర్తింపు పొంది, ప్రత్యర్ధులకు సింహస్వప్నంగా పేరొందిన కేసీఆర్ ఆ పార్టీకి నాయకుడిగా ఉండగా పార్లమెంటు ఎన్నికల్లో ఈ దుస్థితి రావడమేంటనే ప్రశ్న ఉదయిస్తోందీ.
ఊహించని పరిణామం కాదుగదా?
బీఆరెస్ పార్టీ అధినేత కేసీఆర్ వేసుకున్న అంచనాలు తప్పి ఊహించని పరిణామాలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజమే మూడవసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భావించినప్పటికీ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. వాస్తవానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని 2014లో రాష్ర్ట సాధన నేతగా తెలంగాణ ప్రజలు బీఆరెస్ కు పట్టం కట్టారు. సుదీర్ఘకాలం ఆంధ్రా నాయకత్వంపై ఆధారపడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుల చేతగాని తనం కూడా దీనికి తోడైంది.
2018లో బీఆరెస్ పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమిష్టిగా ఎదుర్కోవడంలో వైఫల్యం చెందింది. మూడవసారి కాంగ్రెస్ పార్టీ కృషి కంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి దించాలనే భావనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం. బీఆరెస్ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలు, ఆ పార్టీ ఒంటెద్దు, నియంతృత్వ విధానాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. దీంతో ప్రజలు మార్పు కొరుకుని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు.
అధికారాన్ని కోల్పోతామని బీఆరెస్ ఊహించలేదా? అనే ప్రశ్నలు ఇపుడు తలెత్తుతున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేదీ కేసీఆర్ లాంటి సీనియర్ నేతకు తెలియదా? పైగా దేశవ్యాప్తంగా రాజకీయ ఛక్రం తిప్పాలనే ప్రణాళికలు రచించిన విషయం బహిరంగమేకదా? ఇక బీజేపీ నుంచి ఎదురయ్యే సవాల్, రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్ వేచిచూస్తున్న విషయం కేసీఆర్ కు ఆ పార్టీ ముఖ్యనాయకులకు తెలియదంటే అమాయకత్వమవుతోంది. ఇక కవిత అరెస్టు కూడా అంతగా ఊహించని అంశమేమి కాదు. కానీ, ఒక్క ఓటమితో బీఆరెస్ ఈ ఎన్నికల్లో ఎందుకింత అచేతనావస్థలోకి వెళ్ళిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెలరోజుల ముందే ఓటమిని ఊహించినట్లు ఇటీవల కేసీఆర్ అన్నారు.
ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీకి బలమైన నాయకులున్నారు. 39 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులున్నారు. నాయకత్వానికి ఇప్పటికీ కొరత లేదు. శాసనమండలిలో వారిదే మెజార్టీగా ఉన్నారు. అయినప్పటికీ అధికారం కోల్పోగానే గాలితీసిన బుగ్గ తీరు ఆ పార్టీ మారిపోయింది. పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడంలో ఎందుకో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఉద్దండులు, అనుభవజ్క్షులు, ఆర్ధికంగా అన్ని రకాలుగా బలపడిన నాయకులు సైతం తమకు ఎన్నికల అనుభవమే లేనట్లు వ్యవహరించడంలో మతలబేమిటన్నీ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యనేతల ముందస్తు ప్రణాళికేనా?
రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బీఆరెస్ పోటీచేస్తోంది. ఆ పార్టీకి అభ్యర్ధుల కొరతకూడాలేదు. బలమైన నాయకత్వం ఉంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకత్వం, కేడర్ బలంగా ఉన్నప్పటికీ ఏదో నిస్తేసం ఆపార్టీని వెంటాడుతోంది. ఇది పదేండ్లు అనుభవించిన అధికారం కోల్పోయిన నిరాశనా? లేక పార్టీ నాయకత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం పట్టించుకోవడంలేదా? అనే అనుమానాలున్నాయి. కొన్ని నియోజకవర్గాలను మాత్రమే టార్గెట్ చేసి మిగిలిన చోట్ల చేతులెత్తేసినట్లు ప్రచారం సాగుతోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ ఓటమి లక్ష్యంగా అంతర్గతంగా పావులు కదుపుతోందంటున్నారు. పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరేందుకు బీఆరెస్ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఇప్పటికే అరోపణలు చేసింది. ఈ ఆరోపణలు నిజమనిపించేలా? బీఆరెస్ నాయకులు తీరు ఉంది. ఉదాహరణకు వరంగల్ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆరెస్ కంటే బీజేపీ బలమైన పార్టీకాదు. బీజేపీకి గ్రామ స్థాయిలో పునాదులు లేనేలేవు. పైగా బీజీప అభ్యర్ధి కూడా బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్. అయినప్పటికీ ఇక్కడ బీఆరెస్ అభ్యర్ధి మారపల్లి సుధీర్ కుమార్ ప్రచారం పెద్దగా సాగకపోవడం చర్చకు కారణమవుతోంది.
ఇదే తీరు నాగర్ కర్నూల్, జహీరాబాద్, మల్కాజీగిరి, భువనగిరి, నల్లగొండ, ఆదిలాబాద్ తదితర చోట్ల సాగుతోందనే విమర్శలున్నాయి. బీజేపీతో బీఆరెస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్న ఫలితంగా అక్కడ బీజేపీ గెలుపొందే విధంగా బీఆరెస్ నామ మాత్రంగా ప్రచారం చేస్తున్నారనే విమర్శిస్తున్నారు. అభ్యర్ధులను డమ్మీగా మార్చి వారిని బలిపశువులను చేస్తున్నారంటున్నారు. ఎమ్మెల్యేలుగా లేనంత మాత్రానా నియోజకవర్గాల్లో పదేండ్లు అధికారం చెలాయించిన నేతలు మాజీలు కాగానే పట్టుకోల్పోయారా? అంటున్నారు. అసలు బీఆరెస్ ఎన్నికలను ఎదుర్కొనే తీరే ఇది కాదని, ఈ ఎన్నికల్లో కేసీఆర్ మార్కు కనిపించడం లేదంటున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామం పార్టీకి ఆత్మహత్యాసదృశ్యంగా మారుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.