BRS Protest Against RTC Bus Fares | ఆర్టీసీ చార్జీల పెంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ భగ్గుమంది. పెంచిన చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

brs-protest-demanding-rollback-of-hike-in-rtc-bus-fares

విధాత: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సు చార్జీల పెంపుపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) భగ్గుమంది. పెంచిన చార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీనియర్‌ నాయకులతో కలిసి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌ నగర ప్రజలపై పెంచిన భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్‌ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సంస్థ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణ కాంగ్రెస్ కుట్ర – కేటీఆర్

ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని చూస్తూ, అంతిమంగా సంస్థను ప్రైవేట్‌పరం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేందుకు కుట్ర చేస్తోందని, ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆరోపించారు.

ఆర్టీసీ ఎండీతో బీఆర్‌ఎస్ భేటీ అయిన తర్వాత చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ లేఖ అందజేశారు. ప్రభుత్వ బకాయిలపై వివరాలు అడగగా, ‘మహాలక్ష్మి’ పథకానికి సంబంధించిన ₹1353 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఎండీ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ₹9246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్‌ను (TS RTC కింద) విడుదల చేసినట్టు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.

ఆర్టీసీ ఎండీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. “తెలంగాణలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయం. మహిళలకు ఉచిత బస్సును స్వాగతిస్తున్నాం, కానీ బస్సుల సంఖ్య పెంచాలి. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగవాళ్ల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారు. ఒక చేత్తో ఫ్రీ ఇచ్చి మరో చేత్తో బస్‌ టికెట్ ధర పెంచడం దారుణం.” అని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా చేయాలో తెలియదు. వారికి సర్కస్ నడపడమే తెలుసు. శాంతియుతంగా బయటకు వచ్చి బస్సు ఎక్కి ఆర్టీసీ ఎండికి లేక ఇస్తామంటే అడ్డగోలుగా పోలీసులను దింపి అందర్నీ అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని… రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గి… ఈ నేపద్యంలో మరోసారి టికెట్ల రూపంలో చార్జీలు పెంచి భారం మోపడం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు సేవ కారణంగా నష్టం వస్తే, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజలపై మోపకూడదు. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ సామాజిక బాధ్యత. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా భరించింది. ఆర్టీసీ లాభాల్లో ఉంటే బస్‌ ఛార్జీలు ఎందుకు పెంచారు?” అని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

‘చలో బస్ భవన్’లో ఉద్రిక్తత, నేతల హౌస్ అరెస్ట్‌పై నిరసన

చార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘చలో బస్సు’ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, ప్రభుత్వం ఆయనతో పాటు పార్టీ నేతలకు బస్సు భవన్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీంతో, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ (రెటీఫైల్) బస్ స్టాప్ నుంచి బస్సులో బస్సు భవన్ వరకు చేరుకున్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. చివరికి, ప్రజాప్రతినిధులను మాత్రమే బస్సు భవన్‌లోకి అనుమతించారు. హౌస్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్, “వారు ప్రజాస్వామ్యబద్ధంగా బస్సులో కూర్చుని నిరసన తెలియజేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అర్థం లేని నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

చార్జీల పెంపు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీ నేతలు అందరిని ఎక్కడికి అక్కడ అరెస్టు చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ నేతలను అరెస్టు చేయడం పైన ఉన్న ఆసక్తి రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటును తగ్గించడం పైన పెడితే మంచిదని పోలీసులకు ప్రభుత్వానికి ఇతవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను పెంచిందని వాటిని వెనక్కి తీసుకోవాలని బస్సులో వెళ్లి ఆర్టీసీ ఎండికి లేఖ ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.