రాష్ట్రంలోని మహిళా సంఘ సభ్యులందని కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు
సర్వపిండితో పాటు పలు వంటకాల కొనుగోలు
రుచికరంగా ఉన్నాయని మంత్రి అభినందన
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళా సంఘ సభ్యులందని కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇప్పటికే గుర్తించిన 17 వ్యాపారాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సీఎస్ శాంతికుమారితో కలిసి రాష్ట సచివాలయంలో శుక్రవారం రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంబించారు. సర్వపిండితో పాటు పలు వంటకాలను వారు కొనుగోలు చేసి రుచి చూశారు. మంచి రుచి, నాణ్యమైన ఆహర పదార్ధాలను అందిస్తున్న మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులను అభినందించారు. సచివాలయంలో సందర్శకులకు తెలిసేలా మంత్రుల పేషిల వద్ద మహిళ శక్తి క్యాంటీన్ల అడ్రస్ తెలిపే బోర్డులు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతు..మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంటను ప్రతి ఇంటికి అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘ సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి.. వేల మందికి ఉపాధి కల్పించాలని కోరారు. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పథంలో నడవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యాంటిన్లు, సోలార్ ఉత్పత్తి, ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ ఫోటోగ్రఫీ, మీ సేవ కేంద్రాల వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నామన్నారు. గ్రామాల్లో జరిగే ఫంక్షన్లకు మహిళా సంఘాలు పిండివంటలు సరఫరా చేసే స్థాయికి ఎదగాలన్నారు.
మహిళా శక్తి క్యాంటీన్లకు సెక్రటేరియట్లో మొదటి అడుగు పడిందన్న మంత్రి 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళా శక్తి కాంటీన్లను ప్రారంభి్ంచే పనులను వేగవంతం చేయాలని సీఎస్ శాంతి కుమారిని కోరారు. తెలంగాణ మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేసారు. మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంబోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారితో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీఆర్ అండ్ ఆర్ డీ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ, సీఎం కార్యలయ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గోన్నారు.
కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్న మహిళా శక్తి క్యాంటిన్లు
సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటిన్లు కార్పోరేట్ క్యాంటీన్లకు తీసిపోని విధంగా ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన రెండు క్యాంటిన్లు చూడగానే ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఈ క్యాంటీన్లలో పిండివంటలు, చిరుతిళ్లు, స్నాక్స్, స్వీట్లు, పొడులు, పచ్చల్లు, సర్వప్ప, సకినాలు, హరిసెల వంటి తెలంగాణ చిరు తిళ్లను విక్రయిస్తున్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి సీతక్క సర్వపిండిని కొనుగోలు చేశారు. మహిళా సంఘ సభ్యుల అతీధ్యాన్ని స్వీకరించి పిండి వంటల రుచి చూసారు. పచ్చడితో గారేలను రుచి చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలనలు గుర్తు చేసుకున్నారు. తమ ఇంటిలో తిన్నట్లుగానే పిండి వంటలు రుచిగా ఉన్నాయని మంత్రి కితాబిచ్చారు. దినదినాభివృద్ధిగా వ్యాపారం వర్దిల్లాలని ఆకాక్షించారు. తమకు శిక్షణ ఇచ్చి క్యాంటిన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మహిళా సంఘాల సభ్యులు మంత్రికి దన్యవాదాలు తెలిపారు. మీ సహకారంలో మరింత ముందుకు వెళ్దామన్నారు.