శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్వేపై చిరుతను గుర్తించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుతపులి సంచరించడాన్ని సిబ్బంది గమనించారు
తల్లి చిరుత వెంట రెండు చిరుత కూనలు
విధాత, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్వేపై చిరుతను గుర్తించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో చిరుతపులి సంచరించడాన్ని సిబ్బంది గమనించారు. ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్టు ప్రహరీ నుంచి దూకిందని.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా ఉన్నాయని వాటిని చూసిన సిబ్బంది చెబుతున్నారు. చిరుత సంచారంపై విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఎయిర్ పోర్టు ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్టులోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించే ఏర్పాట్లు చేస్తున్నారు.