నేడే క్రిస్మస్

ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా, అతిసుందరమైన నిర్మాణంగా గుర్తింపుపొందింది. యేసయ్య సన్నిధిగా.. క్రైస్తవుల ఆరాధన మందిరంగా.. మెదక్ మహాదేవాలయంగా

నేడే క్రిస్మస్

– వేడుకలకు ముస్తాబైన మెదక్ క్యాథడ్రల్ చర్చి

– రంగురంగుల విద్యుద్దీప కాంతులతో ముస్తాబు

– ఆకట్టుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా, అతిసుందరమైన నిర్మాణంగా గుర్తింపుపొందింది. యేసయ్య సన్నిధిగా.. క్రైస్తవుల ఆరాధన మందిరంగా.. మెదక్ మహాదేవాలయంగా.. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గా దేశ, విదేశాల్లో గుర్తింపుపొందిన మెదక్ క్యాథడ్రల్ చర్చి సోమవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. సుందరకట్టడం.. అంకుటిత దీక్ష.. ప్రతి రాతిలో కొట్టొచ్చినట్లు కనబడే జీవనకళ.. వందేండ్లకు దగ్గర పడుతున్న చెక్కుచెదరని కళాత్మకత.. ఈ చర్చిని వర్ణించేందుకు బహుశా అక్షరాలు సరిపోవేమో. సోమవారం క్రిస్మస్ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు ఇంచార్జి బిషప్ కే పద్మారావు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు.

99 ఏళ్ల పురాతన కట్టడం

అతి సుందర ఆధ్యాత్మిక కట్టడం అప్పుడే 99 ఏళ్లకు చేరుకుంది. అడుగు దూరంలో శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్దదిగా పేరొందిన కరుణామయుడు కోవెల… మానవత్వానికి.. మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచిన మహోన్నత నిర్మాణం… ఈ అద్భుత నిర్మాణం ఎంతోమంది ఆకలి తీర్చింది.. అందుకేనేమో మతానికి కాకుండా ఈ చర్చి పర్యాటకంగా ప్రజల మనస్సుల్లో నిలుస్తోంది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన చర్చి మహాదేవాలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. 1979 సంవత్సరంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వెస్లీయన్ మెథడిస్ట్ వారు మెదక్ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించారు అప్పట్లో మత ప్రబోధకుడైన పాస్నెట్ మెదక్ పట్టణంలోని ఓ చిన్న చర్చిలో మత గురువుగా నియమితులయ్యారు. క్రీస్తు అంటే ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్న ఆయన మెదక్ ప్రాంతంలో మత ప్రచారంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత మిషన్ కాంపౌండ్ లోని చిన్న చర్చి సమీపంలో నిర్మించిన రెండంతస్తుల భవనంలోనే నివసించేవాడు. రోజు మాదిరిగానే ఓ సాయంత్రం భవనంపైకి ఎక్కి పైఅంతస్తు పైభాగంలో నుంచి చర్చిని గమనించాడు. చర్చి కన్నా తాను నివసించే భవనం ఎత్తుగా ఉండడం సరికాదని భావించాడు. తప్పుని సరిదిద్దుకునే మార్గం గురించి తీవ్రంగా ఆలోచించాడు.



 



ఈ క్రమంలో ఆలోచన మెదిలింది.. తన నివాస భవనం కన్నా చాలా పెద్దదైన చర్చిని నిర్మించడం ద్వారా పాప పరిహారం చేసుకోవాలని నిర్ణయించాడు. ఇంగ్లాండ్ లోని స్నేహితులకు తన ఆలోచన చెప్పాడు. వారు తమవంతు సహకారాలకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో నాటి హైదరాబాద్ రాష్ట్రంలో భయంకరమైన కరువు ఏర్పడింది. దుర్భిక్షం నెలకొంది. పంటలు పండే పరిస్థితి లేక, పనులు దొరక్క ప్రజలకు ఉపాధి కరువైంది. వేలాదిమంది ఆకలి దప్పులతో అల్లాడారు. ఈ నేపథ్యంలోనే పాస్నెట్… పనికి ఆహారం తరహాలో చర్చి నిర్మాణం పనులు చేపట్టారు. తద్వారా ప్రజలకు పని, ఉపాధి చూపి ఆదుకున్నారు. ఈ విషయం తెలిసిన మెదక్ ప్రాంతవాసులే కాక పొరుగు జిల్లాల నుంచి సైతం ప్రజలు మెదక్ బాటపట్టారు. 1914లో మెదక్ చర్చి నిర్మాణ పనులు ప్రారంభమై, 1924లో పూర్తయ్యాయి.

అబ్బురపరిచే సుందర దృశ్యాలు

చర్చి నిర్మాణంలో పలు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు ఎక్కడ చూసినా శిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. అలాగే చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్లు తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్ లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రగతిగా నిలుస్తున్నాయి. ఏసుప్రభుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి భోజనం చేశారు.. ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు చర్చిలో నిర్మించారు.

అందమైన గాజు అద్దం

చర్చి మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్ కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బారి రూపొందించారు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనబడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు, పడమర పడే కాంతిపుంజాలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి వేరువేరు సంవత్సరాల్లో అమర్చినట్లు చెబుతుంటారు.

ఏసు జన్మ వృత్తాంతం…

ఏసు పుట్టుకను తెలియజేసేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో యేసు ప్రభువు తల్లి మరియ, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు, ఎడమవైపు గొల్లలు, మధ్యలో గాబ్రియల్ లోక రక్షకులు కుడివైపు జ్ఞానులు ఉంటారు. పైభాగంలో యేసుకి ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్దమనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టుకకు 700 ఏళ్లకు క్రితమే ఏసుప్రభు పుడతాడని యేష యా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయన గుర్తుగా ఈ కిటికీలో పెద్దమనిషిని పెట్టినట్లు ప్రతీతి.

పడమర కిటికీలో యేసు శిలువ వృత్తాంతం..

యేసు శిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందించిన ఈ కిటికీని 1958లో అమర్చారు శిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చొని ఉన్న తల్లి మరియ, మీద చెయ్యి పట్టుకొని నిలబడి మద్ద లేని మరియా దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతో పాటు ఏసు శిష్యుడు యోహాన్ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్ కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్లకుకడతాయి. కుడివైపు బల్లెం పట్టుకొని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తాడు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వాక్యాలు ఉన్నాయి.

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో చర్చిని అందంగా అలంకరించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇంచార్జి బిషప్ కే పద్మారావు వేడుకలను ప్రారంభించి, దైవ సందేశం ఇవ్వనున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం చర్చి ఆవరణలో పలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. ఆలయ నిర్వాహకులతో పాటు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నందున జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్కులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ఐ నిర్వాహకులు కోరారు.

భారీ బందోబస్తు : ఎస్పీ మహేందర్

చర్చి ప్రాంగణంలో జిల్లా ఎస్పీ మహేందర్ అధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాలనుండి బలగాలను మెదక్ జిల్లాకు రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరా, ఇతర సీసీ కెమెరాల అనుసంధానంతో పోలీస్ కంట్రోల్ రూమ్ లో ప్రతేక ఏర్పాట్లు చేశారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. మెదక్ డీఎస్పీ ఫణీంద్ర, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి తదితరులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 535 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఏఎస్పీ మహేందర్ విధాత బ్యూరోకు చెప్పారు.