కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
విధాత: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా పోడు వ్యవసాయంచేస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు తుండెడ గ్రామం చేరుకున్నారు. అటవీశాఖ భూముల్లో పోడు వ్యవసాయం కోసం చెట్లు నరుకుతున్న గ్రామస్తులను అధికారులు అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు గొడ్డళ్లు, కర్రలు, రాళ్ళతో అధికారులపై దాడికి యత్నించారు. దాడి నుంచి అధికారులు తప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త పోడు చేయొద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. కలెక్టర్, తహశీల్ధార్లతో మాట్లాడి తర్వాత పోడు చేయొచ్చని వారం రోజుల క్రితమే పోడు దారులకు చెప్పామని, అయినా పోడు చేస్తున్నారని, దీంతో అడ్డుకునేందుకు తాము వెళ్లామని, పోడుదారులు తమపై దాడికి దిగారని అటవీశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్వో అప్పల కొండ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు పోడురైతులు మాత్రం 30 ఏళ్ళుగా ఈ భూములను తాము సాగు చేస్తున్నామని, భూమికి సంబంధించిన పట్టాలు కూడా ఉన్నాయని, ఫారెస్ట్ అధికారులే తమపై దౌర్జన్యంగా దాడికి పాల్పడ్డారని, జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.