పద్మ నా బిడ్డలాంటిది.. ఆమె గెలిస్తే మెదక్‌కు అన్నీ వస్తాయి: సీఎం కేసీఆర్‌

  • Publish Date - November 15, 2023 / 02:39 PM IST
  • రాజకీయం అంటే మ్యాట్నీ కాదు
  • ఎవడో చెప్పిండని ఓటేస్తే
  • ఆ ఓటే మనల్ని కాటేస్తది
  • మెదక్‌ సభలో సీఎం కేసీఆర్‌

విధాత, మెదక్‌ ప్రతినిధి: రాజ‌కీయాలు అంటే సుల‌భంగా తీసుకోవ‌ద్దు.. ఓటును సుల‌భంగా వేయొద్దు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. రాజ‌కీయం అంటే చాలా గంభీర‌మైన విష‌యం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవ‌డో చెప్పిండ‌ని ఓటేస్తే ఆ ఓటే మ‌న‌ల్ని కాటేస్త‌ది. అందుకే జాగ్ర‌త్త అని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. రామాయంపేట ప్ర‌జ‌లు.. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి ప‌వ‌ర్ ఏందో చూశారు కాదా..? ఆర్డీవో ఆఫీసు వ‌చ్చిందా..? హ‌రీశ్‌రావు ప్రారంభించిండా..? డిగ్రీ కాలేజీ వ‌చ్చిందా..? ఇవ‌న్నీ వ‌చ్చాయి.. ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి నా బిడ్డ అని ఉట్టిగా చెప్ప‌లేదు. ఆమె అనుకుంటే ప‌నులు ఎలా అవుతున్నాయో మీరు చూస్తున్నారు. హెలికాప్ట‌ర్‌లో వ‌స్తూ మంజీరా న‌ది చూశాను. నీళ్లతో నిండుగా క‌న‌బ‌డుతుంది. గ‌తంలో మంజీరాను ఎండ‌బెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాల్వ‌ల్లో చెట్లు, గ‌డ్డి మొలిచి ఉండే. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. నీళ్లు పారుతున్నాయి. ప‌ద్మా చొర‌వ తీసుకోవ‌డంతో, బ్ర‌హ్మాండంగా బాగు చేసుకున్నాం. ఘ‌ణ‌పురం ఆయ‌క‌ట్టు కింద 40 వేల ఎక‌రాలు పండుతుంది. మీ నెత్తిమీద‌నే కుండ‌లాగా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఉంది. మెద‌క్ హైట్‌లో ఉంది కాబ‌ట్టి సంపూర్ణంగా నీళ్లు తీసుకొచ్చే బాధ్య‌త నాది. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల‌కు నీళ్లు వ‌చ్చాయి. రాని ఏరియాకు నీళ్లు తెచ్చి ఇస్తా. న‌ర్సాపూర్ కాల్వ‌లు త‌వ్వుతున్నారు. అవి పూర్త‌వుతాయి. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి 58 ఏండ్లు మ‌న గోస‌పోసుకుని, ఉద్య‌మాలు చేస్తే, మ‌న పిల్ల‌ల్ని కాల్చి చంపి, రాచిచంపాన పెట్టిన కాంగ్రెస్ కొత్త రూపంతో మ‌ళ్లీ వ‌స్తుంది. మోస‌పోతే మ‌ళ్లీ గోస‌ప‌డుతాం.




 


పొద్దున్నుంచి రాత్రి వ‌ర‌కు మీ మ‌ధ్య‌లో ఉండే ప‌ద్మ గెలిస్తే.. మీ కోసం ప‌ని చేస్తుంది. రింగ్ రోడ్డు, ఇంజినీరింగ్ కాలేజీ ఆటోమేటిక్‌గా న‌డుచుకుంటూ వ‌స్త‌యి. ఆ అవ‌కాశం పొగొట్టుకుంటే చాలా ప్ర‌మాదం అయిత‌ది. మ‌ళ్లీ తెలంగాణ ఇబ్బందుల పాల‌వుత‌ది. సంప‌ద పెంచుకుంటూ ప్ర‌జ‌ల‌కు పంచుకుంటూ ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ. సంప‌ద పెంచ‌లేదు.. మ‌న‌ల్ని స‌ర్వ‌నాశ‌నం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు. మ‌ళ్లా ఇప్పుడు వ‌చ్చి త‌మాషాలు చెబుతున్నారు. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి, ఆ కాంగ్రెస్‌ల‌ నిల‌వ‌డ్డొనికి ఏమ‌న్నా పోలిక ఉందా..? ఏదో దిష్టిబొమ్మ‌ను తీసుకొచ్చి ప‌ద్మ ఎదురుగా పెడితే.. ఆయ‌న గెల‌వాలి.. మ‌నం ఓడిపోవాల్నా..? ప‌ద్మా గెల‌వాలి. వంద శాతం గెలిపించండి.. మీ త‌ర‌పున ఆమె కోరిన కోరిక‌ల‌ను తీర్చే బాద్య‌త నాది.

వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల క‌రెంట్ స‌రిపోత‌ది. 10 హెచ్‌పీ మోటారు పెట్టుకోవాల‌ని రేవంత్ రెడ్డి అంటుండు. రైతుల వ‌ద్ద ఈ మోటార్లు ఉంటాయా..? మ‌న రైతుల వ‌ద్ద 3, 5 హెచ్‌పీ మోటార్లు ఉంటాయి. మ‌రి 10 హెచ్‌పీ మోటార్లు పెట్టాలంటే.. మ‌న వ‌ద్ద 30 ల‌క్ష‌ల పంపు సెట్లు ఉన్నాయి. 30 ల‌క్ష‌ల పంపు సెట్ల‌కు 10 హెచ్‌పీ మోటార్లు కొనాలంటే ఎవ‌డు డ‌బ్బులివ్వాలి..?.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణి తీసి బంగాళాఖాతంలో వేస్తామ‌ని అంటున్న‌రు. రైతుబంధు విడుద‌లైతే టింగ్ టింగ్ మ‌ని సెల్‌ఫోన్ మోగుత‌ది. మీ ఖాతాలో డ‌బ్బులు ప‌డుతున్నాయి. ఏ ఆఫీసు తిర‌గ‌కుండా, లంచం ఇవ్వ‌కుండా డ‌బ్బులు వ‌స్తున్నాయి. రైతుబీమా కూడా అదే త‌ర‌హాలో వ‌స్తుంది. ధాన్యం కొనుగోలు చేశాక నాలుగైదు రోజుల్లో డ‌బ్బు ప‌డుతుంది. ధ‌ర‌ణి బంగాళాఖాతంలో వేస్తే ఈ డ‌బ్బులు ఎలా వ‌స్తాయి. మీ ఓటుతోనే మీ వేలితోనే మీ క‌న్ను పొడిపించాల‌ని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ధ‌ర‌ణి తీసేస్తే చాలా ప్ర‌మాదదాలు వ‌స్తాయి. లంచాలు, ద‌ళారీలు, పైర‌వీకారుల రాజ్యం వ‌స్త‌ది. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా, అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతోంది. ధ‌ర‌ణి ఎత్తేస్తాం, 3 గంట‌ల క‌రెంట్ ఇస్తాం.. ఇది మా పాల‌సీ అని చెబుతున్నారు.

డీకే శివ‌కుమార్ క‌ర్ణాట‌క నుంచి వ‌చ్చి మా రాష్ట్రంలో మేం 5 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నాం అని చెబుతుండు. అరే స‌న్నాసి మా ద‌గ్గ‌ర 24 గంట‌ల క‌రెంట్ ఇస్తున్నామ‌ని చెప్పిన‌. ఐదు గంట‌లు ఇచ్చేటోడు వ‌చ్చి 24 గంట‌లు ఇచ్చేకాడ వ‌చ్చి చెబుతుండ్రు. ఇది కాంగ్రెస్ విధానం. అదే క‌ర్ణాట‌క‌లో 20 గంట‌ల క‌రెంట్ ఇస్త‌మ‌ని చెప్పారు. క‌ర్ణాట‌క రైతులు వ‌చ్చి గొడ‌గొడ ఏడుస్తుండ్రు. దొంగ కాంగ్రెస్‌ను న‌మ్మి మోస‌పోకండి.. మా బ‌తుకు పోయింద‌ని అంటున్నారు క‌ర్ణాట‌క రైతులు. కాబ‌ట్టి ఎవ‌డో చెప్పిండ‌ని ఓటేస్తే ఆ ఓటే మ‌న‌ల్ని కాటేస్త‌ది.

‘ఎలక్షన్‌ వచ్చిందంటే ఆగమాగం అడివడివి. అబద్ధాలు చెప్పడం. అబాంఢాలు వేయడం. ఇష్టమైన ప్రచారాలు చేయడం. వాగ్ధానాలు చేయడం. జనాల్ని మోసం చేసే పని నడుస్తుంటుంది. ఇది ప్రజాస్వామ్య పరిణితికి మంచిది కాదు. 75 సంవత్సరాల భారతంలో మన ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది’

‘ఎన్నికల్లో అభ్యర్థుల చరిత్రను చూడాలి. దానికంటే ముఖ్యంగా పెద్ద పార్టీలున్నయ్‌. ఆ పార్టీల చరిత్ర, వైఖరి, నడవడిక, పార్టీ అధికారం ఇస్తే ఏం చేశారు ? ఏం చేయలేదనేది గమనించాలని కోరుతున్నా. పార్టీల నడవడికన పరిశీలిస్తే మంచీచెడు తెలుస్తుంది. ఓటు మంచివాళ్లకు వేస్తే మంచి జరుగుతుంది. 30 తారీఖున ఎట్లయిన ఓట్లుపడుతయ్‌. 3న లెక్కపెడుతరు. ఆడికిపోదు కథ. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్‌లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటు అనేది తలరాతను రాస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి వస్తే లాభం జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ ఓటే కాటేసే అవకాశం ఉంటది. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. ఈ విషయం మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ మీ ముందే పుట్టింది.. ప్రభుత్వంగా పని చేసింది. కాంగ్రెస్‌కు 50 ఏళ్ల చరిత్ర ఉన్నది. తెలంగాణ వచ్చిన సమయంలో గందరగోళమైన పరిస్థితులుండే. అవన్నీ సరిచేసి పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో మీ కండ్లముందున్నది. పేదల సంక్షేమం, కరెంటు, రైతులు, సాగునీరు, పరిశ్రమలు, ఐటీరంగం వీటిపై దృష్టిపెట్టి పని చేసింది బీఆర్‌ఎస్‌’

‘సంక్షేమంలో మనం ఇండియాలోనే నెంబర్‌ వన్‌. మనకు ఎవరూ సాటిలేరు. చాలా అద్భుతమైన సంక్షేమం ఇస్తున్నాం. రైతుల గురించి ఆలోచిస్తే ఐదు కార్యక్రమాలను తీసుకున్నాం. ఇదే మెదక్‌కు వచ్చిన సందర్భంలో అప్పటి కలెక్టర్‌ చెప్పారు. నీటి తీరువా బకాయిలు ఉన్నయ్‌. రైతులు బాధపడుతున్నరు. వాటిని మాఫీ చేయాలని ఆయన చెప్పారు. మా మంత్రి హరీశ్‌రావు చెప్పిండు. వాటిని రద్దు చేశాం. నీళ్లకు ట్యాక్స్‌ లేదు. ఘనపురం ఆనకట్ట ద్వారా తీసుకున్న నీళ్లకు ట్యాక్స్‌ లేదు. కాళేశ్వరం నీళ్లు వచ్చినా ట్యాక్స్‌ లేదు. మంచినాణ్యమైన కరెంటు 24 గంటలు ఉచితంగా ఇస్తున్నం. రైతుబంధు పెట్టుబడి ఇస్తున్నం. పండించిన ధాన్యాన్ని నష్టం వచ్చినా ప్రభుత్వమే కొంటున్నది. రైతుబీమా అందజేస్తున్నాం. కానీ పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది’

‘కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు మాట్లాడుతున్నరు. కేసీఆర్‌కు పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతుబంధు ఇచ్చి దుబార చేస్తున్నడని మాట్లాడుతున్నరు. రైతుబంధు ఉండాల్నా వద్దా ? రైతుబంధు ఉండాలంటే పద్మాదేవేంద్‌రెడ్డి గెలవాలి. రైతుబంధు ఉండుడు కాదు.. పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తే రూ.16వేలు అవుతుంది. ఏది కావాలో తేల్చుకోవాలి. రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా వేస్ట్‌. కేసీఆర్‌ డబ్బులన్నీ దండగ చేస్తున్నడని మాట్లాడుతున్నడు. మరి 24గంటల కరెంటు వేస్టా? పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు మూడు గంటల కరెంటు సరిపోతుందటా? మూడుగంటలకు మడి తడుస్తుందా ? దానికి ఆయన చెప్పే సిద్ధాంతం.. మూడుగంటల కరెంటు చాలూ.. పది హెచ్‌పీల మోటర్‌ పెట్టుకోవాలట? మరి రైతుల దగ్గర పది హెచ్‌పీల మోటర్‌ ఉంటదా? 3, 5 హెచ్‌పీల మోటర్లు మనదగ్గర ఉంటయ్‌. మరి రైతులదగ్గర 30లక్షల మోటర్లు ఉన్నయ్‌. మరి వాటిని మార్చాలంటే డబ్బులు ఎవడు ఇవ్వాలి..?.