రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందనీ, దీని కోసమే ఈ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ కోరుతుందనీ, ఈ కోరిక వెనుక దాగిన రహస్యమిదేనని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు
విధాత ప్రత్యేక ప్రతినిధి: రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందనీ, దీని కోసమే ఈ ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ కోరుతుందనీ, ఈ కోరిక వెనుక దాగిన రహస్యమిదేనని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటబోయే ఆట ఫైనల్…గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతోంది. ఈ పోటీలో ఎవరో తేల్చుకుందాం రా బిడ్డా! అంటూ సవాల్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ రాజ్యాంగం ద్వార రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీ నాయకులు వాటిని రద్దు చేయాలనుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య ఎన్నికల ప్రచారం సందర్భంగా రేగొండలో మంగళవారం నిర్వహించిన జనజాతర సభకు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్రచేస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకు బీజేపీ నాయకులను నిలదీస్తే తన పై ఢిల్లీలో కేసుగట్టి గాంధీభవన్ కు పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల పై వేలాది కేసులు పెట్టారని, కేసీఆర్ కక్ష గట్టి నన్ను చంచల్ గూడ జైలుకు పంపిస్తే భయపడ్డామా? అంటూ రేవంత్ గతాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ బీజేపీ కేసులకు భయపడుతామా? అంటూ స్పష్టం చేశారు.
దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ నాయకులు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్ పెత్తందార్లు, ఢిల్లీ సుల్తాన్ లు కేసులు పెడితే భయపడుతామా? అంటూ ప్రశ్నించారు. ఈడీ, ఇన్ కం టాక్సు, సీబీఐ ద్వారా భయపెడుతామంటే చూసుకుందాం రా బిడ్డ గుజరాత్ పెత్తనమా? తెలంగాణ పౌరుషమా? అంటూ సవాల్ చేశారు. దొరలదోపీడీ, భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి లాగుల్లోకి తొండలెక్కించే పోరాటం చేసిన గడ్డ ఇదంటూ గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి రాష్ట్రాన్ని సాధించకున్న గడ్డ మీ బెదిరింపులు లొంగుతుందా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రజల అండతో పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. సైన్యాన్ని దింపినా బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
మండల్ కు అడ్డుగా కమండల్ తెచ్చారు
అంబేద్కర్, కాంగ్రెస్ రాజ్యాంగంలో ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఫలితంగానే ఈ రోజు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు చదువుకుని మంత్రి అయ్యారని, అడవిబిడ్డ సీతక్క మంత్రయ్యారని, కావ్య డాక్టరయ్యారని సీఎం గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని 1978లో మండల కమీషన్ వేసి దానిని అమలుకు ప్రయత్నిస్తే ఇదే బీజేపీ కమండలం పేరుతో అడ్డుకుందని మండిపడ్డారు. బీజేపీ నేత అద్వానీ రథయాత్ర నిర్వహించిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు. బీసీల రిజర్వేషన్ల శాతం 55 కంటే పెంచేందుకు సుప్రీంకోర్టు కుల జనాభా గణన చేపట్టాలని సూచిస్తే పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగాలనే రాష్ర్టంలో జనాభా గణనుకు అదేశించామని చెప్పారు. దేశంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. కానీ, బీజేపీ నాయకులు రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. వీటిని ప్రశ్నిస్తే తనకు పోలీసు నోటీసులు అందిస్తున్నారంటూ విమర్శించారు.
విభజన హామీల పై ప్రశ్నిస్తే కేసులు
పదేండ్లు పూర్తయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో మోదీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్, ఐఐటి, ఐఎంఈ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు చేయడంలో నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పదేండ్ల తర్వాత గిరిజన యూనివర్సిటీకి మొక్కుబడిగా అనుమతినిచ్చారన్నారు. తెలంగాణ ప్రాంతానికి మోదీ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, విమానాశ్రయం రాకుండా మోదీ, అమిషాలు అడ్డుకున్నారని విమర్శించారు. విభజన హామీల పై బీజేపీని నేను నిలదీస్తే తన పై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా నిరసించారు.
బీజేపీ, బీఆరెస్ మధ్య చీకటి ఒప్పందం
బీజేపీ, బీఆరెస్ మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రంగా విమర్శించారు. బీఆరెస్ అధినేత కేసీఆర్ ఖమ్మం ఎన్నికల ప్రచారం సందర్భంగా నామా నాగేశ్వర్ రావు మంత్రి అవుతారంటూ చెప్పడంలో మతలబు ఇదేనన్నారు. బీజేపీకి 200 సీట్లు వస్తాయట, కాంగ్రెస్ కు 40 కూడా రావంటూ చెబుతూ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో తమ పార్టీ ఖమ్మం ఎంపీ కేంద్ర మంత్రవుతారంటూ చెప్పడంలో ఉద్దేశ్యమిదేనన్నారు. బీఆరెస్ ఇంటిమీద వాలిన కాకిని కూడా తమ ఇంటిపై వాలనివ్వమని, బీఆరెస్ కు బీజేపీతో ఒప్పందముందన్నారు. పైగా బీఆరెస్ కు 12 స్థానాలివ్వాలని కోరుతున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆరెస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రేవంత్ అన్నారు. అందుకే బీఆరెస్ తమ పార్టీకి చెందిన వారిని బీజేపీలోకి పంపి తమ పార్టీ తరుపున డమ్మీ క్యాండెట్ లను పోటీలోకి దింపారని చెప్పారు. వరంగల్లో కూడా బీఆరెస్ కు చెందిన ఆనకొండ, భూకబ్జాకోరును బీజేపీలోకి పంపి అమాయకున్ని బీఆరెస్ తరుపున పోటీలో పెట్టారని అన్నారు. బీజేపీ, బీఆరెస్ ఎన్నికల విధానమొక్కటేనని చెప్పారు. బీజేపిలోకి అరూరి రమేష్ ను పంపించి పోటీలో పెట్టారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ ముందు తాకట్టు పెట్టినందున కేంద్ర ప్రభుత్వంలో తమ భాగస్వామ్యముంటుందని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు చీకటి ఒప్పంద చేసుకుని ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్రచేస్తుందన్నారు. దళిత, గిరిజన వర్గాలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.కారు ఖార్కానాకు పోయిందని ఆ పార్టీ నేత కేటీఆర్ చెబుతున్నారు గానీ అది జుమ్మేరాత్ బజార్ కు పోయిందని అక్కడ తూకానికి అమ్మాల్సిందేని, ఇక తిరిగిరాదనే ఆ పార్టీ అధినేత బస్సులో తిరుగుతుండని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత నాదని, ఎంపీగా కడియం కావ్యను గెలిపించి రాహుల్ ను ప్రధాని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు,కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు భారీగా జనం హాజరయ్యారు.