సీఎం రేవంత్ ఢిల్లీ పయనం..కేబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు!

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో సమావేశమై కేబినెట్ విస్తరణ, డీసీసీ నియామకాలు, యువత రాజకీయ ప్రవేశం, పార్టీ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. . రేవంత్ తాజా ఢిల్లీ పర్యటన.. 74వ పర్యాయం కావడం విశేషం. సోమవారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు ‘సర్‌’ ప్రక్రియ, పార్టీ వ్యవహారాలతో పాటు ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే కార్యాచరణపై చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్ర పాలనాపరమైనా అంశాలు, జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన కొత్త వ్యూహాలపై ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు.

చట్టసభలకు పోటీకి వయోపరిమితి కుదింపు ప్రతిపాదనపై కీలక చర్చలు

సీఎం రేవంత్ రెడ్డి యువతను కాంగ్రెస్ కు దగ్గర చేసే వ్యూహాంలో భాగంగా కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రతిపాదన..ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేయడానికి వయో పరిమితిని ప్రస్తుతం ఉన్న 25 సంవత్సరాల 21 ఏళ్లకు తగ్గించడంకు సంబంధించి పార్టీ హైకమాండ్ తో చర్చించనున్నట్లుగా సమాచారం. ‘యువత రాజకీయ ప్రవేశం’.. చట్టసభల్లో యువతకు మరింత ప్రాధాన్యత కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ నూతన ప్రతిపాదనకు తోడుగా ఆయన “జై జవాన్, జై కిసాన్, జై యువ” అనే సరికొత్త నినాదాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదనలపై నేటి ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ స్వయంగా చర్చించనున్నారు. తన ప్రతిపాదనలపై ఇండియా కూటమి నేతలతోనూ చర్చించాలని ఆయన రాహుల్ గాంధీని కోరనున్నట్లుగా తెలుస్తుంది.

కేబినెట్ విస్తరణపై చర్చలకు అవకాశం ?

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యమైనదిగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా సీఎంతో పాటు పార్టీ హైకమాండ్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. గత కొద్ది నెలలుగా పెండింగ్‌లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలు కూడా అధిష్ఠానం సమక్షంలో చర్చకు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రెండు ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేయాలని ఎప్పటినుంచో సీఎం రేవంత్ ఆలోచన చేస్తున్నారు. అయితే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ వాయిదా పడుతుంది. ఈ దఫా ఢిల్లీ పర్యటనలోనూ ఈ అంశంపై స్పష్టంగానే కనిపిస్తుంది. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న రాహుల్, ఖర్గేలు కేబినెట్ విస్తరణ కసరత్తుపై చర్చిచేంత సమయం చిక్కకపోవచ్చనిరాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest News