Site icon vidhaatha

REVANTH REDDY | ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ .. అధికారుల‌తో చ‌ర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి…

ముసాయిదాను సిద్దం చేసిన అధికారులు

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం…

విధాత‌, హైద‌రాబాద్‌:ఢిల్లీ, హ‌ర్యానా త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా స్కిల్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా సిద్దం చేసి ఉంచాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అసెంబ్లీ స‌మావేశాల్లోనే ఈ ముసాయిదా బిల్లును పెట్టే యోచ‌న‌లో స‌ర్కార్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. శుక్ర‌వారం స‌చివాల‌యంలో సీఎం దీనిపైనే అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ముసాయిదాలోని అంశాలపై డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సీఎం అధికారుల‌కు సూచనలు చేశారు.
యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎంకు అధికారులు ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాల‌ని సీఎం వారికి సూచించారు. యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై పలు కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిధుల విషయంలో రాజీపడొద్ద‌న్నారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version