ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు స్తూ ఊపిరి సలపనీయకుండా ఎన్నికల ప్రచార సభలను బీజేపీ, బీఆర్ఎస్లకు ధీటుగా ప్రచార సభలు నిర్వహించారు.
ఎన్నికల ప్రచారమంతా తన భుజ స్కంధాలపైనే..
27 రోజులు 57 సభలు
విధాత: ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఊపిరి సలపనీయకుండా ఎన్నికల ప్రచార సభలను బీజేపీ, బీఆర్ఎస్లకు ధీటుగా ప్రచార సభలు నిర్వహించారు. పార్టీ ప్రచారం మొత్తం తన భుజ స్కందాలపై వేసుకొని ప్రచారాలు నిర్వహించారు.
ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి, మొత్తం 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కొన్నిసార్లు ఒక్క రోజులోనే 4 మీటింగ్లు నిర్వహించి వివిధ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీలు ముఖ్యమంత్రితో కలిసి కొన్ని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
రేవంత్రెడ్డి వాగ్ధాటిని ప్రజలలో ఆయనకున్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రచారాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి ఇతర రాష్ట్రాలకు సైతం ఆయనను ప్రచారానికి పంపించింది. రాష్ట్రంలో ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ దానిని పక్కన పెట్టి కర్నాటక, కేరళల్లో సైతం పర్యటించి అక్కడి పబ్లిక్ మీటింగ్, రోడ్షోలలో ఆయన పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్లో రాహుల్గాంధీ నామినేషన్ కార్యక్రమానికి సైతం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు.ప్రచారం మధ్యలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పత్రికలకు, ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అలుపు సొలుపు లేకుండా తన వాగ్ధాటితో ఆయన ప్రజలను అకట్టుకున్నారు. కేసీఆర్పైనా, మోదీపైన వారి పాలనా వైఫల్యాలపైన పదునైన అస్త్రాలు సంధించి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చారు. రేవంత్రెడ్డి ప్రచార సభలకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.
ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి జరగబోయే నష్టం గురించి ఈయన చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టించాయి. మరీ ముఖ్యంగా బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై మోదీ, అమిత్షా నుంచి బీజేపీ నాయకులందరూ వివరాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలకు ధీటుగా రేవంత్ బదులిచ్చారు. పదేండ్ల పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యాసంస్థల స్థాపనలో నిర్లక్ష్యం వంటి వాటిని బలంగా ఎత్తి చూపారు.
రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీని ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘‘గాడిద గుడ్డు’’ తప్ప ఏమిచ్చింది అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆగస్టు 15లోపు తప్పనిసరిగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చిన అంశం హైలెట్గా నిలిచింది. ఎలాగూ బీఆర్ఎస్ తమకు పోటీనే కాదని, ఈ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే జరుగుతున్నాయని చెప్పిన సీఎం రేవంత్.. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని కట్టడి చేసి రాష్ట్రంలో 14సీట్ల వరకు కాంగ్రెస్ గెల్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.