Site icon vidhaatha

MSME POLICY DOCUMENT । యూనివర్సిటీల నిర్వహణకు రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు

MSME POLICY DOCUMENT । యూనివర్సిటీ నిర్వహణకు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో MSME పాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ మేరకు నిధులను పారిశ్రామిక వేత్తలు నుంచి సేకరిస్తామన్నారు. ఈ నిధులను యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసిందన్నారు.

పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు MSME లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించామని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో వ్యవహరించి, పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. ఆయన ప్రపంచంతో పోటీ పడేలా విధి విధానాలు తీసుకొచ్చారని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదదని, రాష్ట్ర ప్రభుత్వం అందుకే MSME పాలసీ-2024 ను తీసుకొచ్చిందని చెప్పారు. MSMEలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. MSMEలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే… కొత్త పాలసీని ముందుకు తీసుకెళతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిందన్నారు. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడిందని సీఎం చెప్పారు. అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామన్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి సంయుక్తంగా రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు. పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇందులో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్నారు.

అగ్రికల్చర్ అనేది మన కల్చర్
రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించామని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడంలేదన్నారు. తెలంగాణ రైతాంగానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. వ్యవసాయాన్ని వదలొద్దు.. అగ్రికల్చర్ అనేది మన కల్చర్ అని రేవంత్ తెలిపారు. వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే ఇతర కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాలవైపు ప్రోత్సహించాలన్నారు. రైతుల కుటుంబ సభ్యులు వ్యాపారాల్లో రాణించేలా ఎదగాలని కోరారు.

ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు
ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నామని సీఎం అన్నారు. మూసీ అంటే మురికి కోపం కాదు… మూసీ ని మ్యాన్ మేడ్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు. మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదని, ఇది ప్రజల కోసమే పని చేసే ప్రజా ప్రభుత్వం అన్నారు. మా ప్రభుత్వంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న ఆయన అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం తమ ప్రభుత్వం చేస్తోందని రేవంత్ అన్నారు. శిల్పారామంలో 3ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ మహిళల చేతుల్లోపెట్టమన్నారు. మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చామని చెప్పారు. యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్ధికంగా ఆదుకుంటున్నామన్నారు.

Exit mobile version