తెలంగాణ రాజముద్ర మార్పుకు సంబంధించి నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
సాయంత్రం 4 గంటలకు రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజముద్ర మార్పుకు సంబంధించి నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాజముద్రలో ప్రతిపాదించిన మార్పులకు సంబంధించి చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సీం భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.
రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని, ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం ప్రతిబింబించేలా అధికారిక కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని, అధికారిక గీతాన్ని ఆవిష్కరించాలని రేవంత్రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.