అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతుల 2లక్షల రుణమాఫీ అమలును గురువారం సచివాలయంలో ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలిపారు.
విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతుల 2లక్షల రుణమాఫీ అమలును గురువారం సచివాలయంలో ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని కలుస్తానని, వరంగల్లో త్వరలో నిర్వహించనున్న రైతు బహిరంగ సభకు హాజరు కావాలని కోరుతానని తెలిపారు. 5లక్షల మందితో వరంగల్లో సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు..సవాళ్లు ఎదురైనప్పటికి అధిగమించి రుణమాఫీ హామీ అమలు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ లో రాహుల్గాంధీ రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందన్నారు. తుక్కుగూడ ఆరు గ్యారంటీలను ప్రకటించి రైతురుణమాఫీపై సోనియాగాంధీ మాట ఇచ్చారన్నారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసి, రైతు డిక్లరేషన్ చేసిన వరంగల్లో తిరిగి లక్షలాది మందితో సభ నిర్వహించనున్నామని తెలిపారు. 2లక్షల రుణమాఫీలో తొలి విడతగా గురవారం లక్ష వరకు రుణాలను 6వేల కోట్లతో మాఫీ చేయడం జరిగిందని తెలిపారు.
మరోవైపు రైతురుణమాఫీ అమలు నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఫిషేర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు.