Allu Arjun । అల్లు అర్జున్ కు కాలుపోయిందా… కన్ను పోయిందా… ఎందుకు పరామర్శించారు… సినీ ప్రముఖులను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారన్నారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగిందని తెలిపారు.

Allu Arjun । విధాత: ‘‘ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్టేషన్ కు పోయినోడి ఇంటి కాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు నన్ను తిడుతుండ్రు అతన్ని పరామర్శిస్తుండ్రు… అతనికి ఏమైంది అధ్యక్షా… కాలుపోయిందా… కన్నుపోయిందా… చేయి పోయిందా… ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా… ఏమైందీ.. అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించిండ్రు.. కలిసిండ్రు.. అభినందించిండ్రు… కానీ ఆపిలగాన్నీ కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే…సినిమా ఇండ్రస్టీ.. ఇండ్రస్టీలో ఉన్న ప్రముఖులు ఏమి ఆలోచన చేస్తుండ్రో.. ఏమి కోరుకుంటుండ్రో నా కైతే తెలువదు… వ్యాపారాలు చేసుకోండి… కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము…మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవు.. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడిని సీఎం రేవంత్ రెడ్డి నేను సీఎంగా ఉన్నన్ని రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, బెటిఫిట్ షోలకు అనుమతి ఇవ్వను అని స్పష్టం చేశారు.
కొడుకు చేయిపట్టుకొని తల్లి చనిపోయింది
సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీఎం అన్నారు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారన్నారు.అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారన్నారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది… ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడన్నారు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు… బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిదన్నారు.కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయిందని చెప్పారు.
కేసు ఎందుకు పెట్టారంటే…
హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదన్నారు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారన్నారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారన్నారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారని చెప్పారు.ఈ నేపథ్యంలో హీరోపై, యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారన్నారు.
పైశాచికత్వం ప్రదర్శించిన రాజకీయ పార్టీలు
ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయని సీఎం రేవంత్ అన్నారు. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదన్నారు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే… తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారని తెలిపారు.
ప్రోత్సహించాలనే…
సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం అని అడిగారు. సినీ,సిరాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.