రాష్ట్రంలోని బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సోయి లేదని మండిపడ్డారు.
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలోని బొగ్గు గనులు వేలం వేయడమంటే సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సోయి లేదని మండిపడ్డారు. ఏకాభిప్రాయంతోనే సింగరేణి ప్రైవేటికరణకు ఆ రెండు పార్టీలు తేరలేపాయని ఆరోపించారు. నిన్నటి వరకు కలిసి వేలంపాటను నిర్వహిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి ఈ వివాదంలో కేటీఆర్ హెచ్చరికతో మాట మార్చాడన్నారు. సింగరేణి ప్రయివేటీకరణ కుట్రకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పుడు సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆరెస్ శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని పేర్కొన్నారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సింగరేణి గనుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. కృష్ణానది ప్రాజెక్టుల విషయంలో కేంద్రం కుట్రలను ఖండించామని, కేసీఆర్ కదిలిన తర్వాతే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించబోమని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. గోదావరి జలాల తరలింపుపై గతంలో కేసీఆర్ గళమెత్తడంతో కాళేశ్వరం మరమ్మతులకు ముందుకొచ్చారన్నారు. పొరుగు రాష్ట్రాలు గోదావరి నీళ్లు దోచుకుపోతుంటే రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు.
రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష
బొగ్గు గనుల అంశంలో ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిన చూస్తుంటే రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని మళ్లీ నిరూపితమవుతోందన్నారు. బొగ్గు గనుల వేలం వద్దని గతంలో రేవంత్ రెడ్డి ఇదే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఇవాళ మాత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేలంలో పాల్గొన్నారు అని మండిపడ్డారు. కిషన్ రెడ్డి పదవి తీసుకొని హైదరాబాద్లో దిగిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే పని చేశాడని, మన సింగరేణిని నట్టేట ముంచి దానికి ఉరి పెట్టే పని చేశాడని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మందికి పదవులు వస్తే అదృష్టం వచ్చింది అనుకుంటామని, కిషన్ రెడ్డి దురదృష్టవంతుడన్నారు. కిషన్ రెడ్డికి ఎన్ని పదువులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చెయ్యలేదని విమర్శించారు. గత ఐదేండ్లలో కిషన్ రెడ్డి చేసింది ఏమైన ఉందంటే అక్కడ ఎక్కడో రైల్వే స్టేషన్లో పాత లిఫ్టును బాగు చేసి ప్రారంభించడం ఒక్కటేనని ఎద్దేవా చేశారు.