ఒకప్పుడు సెంటిమెంట్ పని చేసిందని, అది యాంటీ ఆంధ్రాగా వాడుకోవడం వల్ల రాష్ట్రం విడిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు
చంద్రబాబు, రేవంత్ లు మాట్లాడుకోవడం శుభ పరిణామం
సీపీ ఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
విధాత: ఒకప్పుడు సెంటిమెంట్ పని చేసిందని, అది యాంటీ ఆంధ్రాగా వాడుకోవడం వల్ల రాష్ట్రం విడిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. సెంటిమెంట్ తాత్కాలికమేనని, ఎప్పటికీ ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ సెంటిమెంట్ను కేసిఆర్ ఉపయోగించుకున్నా ఎప్పటికీ పని చేయలేదని తెలిపారు. అలాగే జగన్మోహన్రెడ్డి కూడా వారి నాన్న సెంటిమెంట్ను ఉపయోగించుకున్నా రెండోవసారి జరిగిన ఎన్నికలలో గెలువలేకపోయాడని అన్నారు. సింటిమెంట్ రాజకీయాలు తాత్కాలికంగానే తప్పా శాశ్వతంగా పనిచేయవన్నారు.
రాజకీయాలలో సెంటిమెంట్తో రెచ్చగొట్టే వారుంటారని వాటిని పట్టించుకోకుండా ఉభయ రాష్ట్రాల ప్రజల క్షేమం కొరకు ఈ ముఖ్యమంత్రుల సమావేశం ఉపయోగపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొదటిసారి సమావేశమవుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు మాట్లాడే ప్రజల క్షేమం కోరాలని వైషమ్యాలు అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబునాయుడు, తెలంగాణ నుండి రేవంత్రెడ్డి కలిసి మాట్లాడుకోవడం ఒక శుభపరిణామం అని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగు మాట్లాడే ప్రజలు భౌతికంగా మాత్రమే రెండు రాష్ట్రాలుగా విడిపోయారని వారి మధ్య వైషమ్యాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమావేశంలో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు వారివారి రాష్ట్రాలకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తూనే, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను కేంద్రం నుండి అమలు చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విలీన గ్రామాల సమస్యలపై సామరస్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటి సమస్యలు ఉండేవని, కానీ అవి అంతర్గతంగా ఉండేవని అన్నారు. ఇప్పుడు కూడా నీటి సమస్యను సామరస్యంగా చర్చించుకోవాలని గుర్తుచేశారు.