డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని, అందులో భాగంగా మధిరలో ఇందిరా డెయిరీకి శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు
విధాత: డ్వాక్రా గ్రూపు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తానని, అందులో భాగంగా మధిరలో ఇందిరా డెయిరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి భట్టి చర్యలు ప్రారంభించారు.
సోమవారం తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మధిర నియోజకవర్గానికి వచ్చిన ఆయన, డీఆర్డీఓ, ఐకేపీ అధికారులతో మధిర క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లా డీఆర్డీఓ ఎం విద్య చందన, డీపీఎంలు శ్రీనివాస్, దర్గయ్య, ఐదు మండలాల ఏపీఎంలు, సీసీలు, సిబ్బందితో సమీక్షించారు. ఇందిరా డెయిరీ ఏర్పాటుపై దిశా నిర్దేశం చేశారు.
నియోజకవర్గంలో డ్వాక్రా గ్రూపులో ఉన్న 53 వేల మంది మహిళలను పాడి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం లక్ష్యంగా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్థిక స్వావలంబన పొందే విధంగా, స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా ఐకేపీ అధికారులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు పాడి గేదెలు ఇప్పించి, వారి నుంచి పాల సేకరణ ఇందిర డెయిరీ చేస్తుందన్నారు.
సేకరించిన పాలను మార్కెట్ చేయడంతో పాటు మిగిలిన పాలతో తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమూల్ కంపెనీకి మించి ఇందిరా డెయిరీ ఉంటుందన్నారు. ఇందిరా డైరీలో ఉండే సభ్యులకు పాల ఉత్పత్తితో వచ్చే ఆదాయంతో పాటు పరిశ్రమలో వచ్చే లాభాల్లో వాటాదారులుగా చేర్చుతామన్నారు.
వ్యవసాయంపైన అవగాహన, ఆధారపడి ఉన్న నిరుద్యోగులకు సైతం ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తామని వివరించారు. పాడి గేదెలు జబ్బు పడ్డప్పుడు రైతులు ఫోన్ చేస్తే, 108 తరహాలోనే వెటర్నరీ అంబులెన్సులో వాటి వద్దకు వెళ్లి వైద్యం అందించే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామని చెప్పారు. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా మధిరలో ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
పదేళ్లుగా కాగితాలకే ప్రాజెక్టు దుస్థితి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2013-14లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని భావించారు. ఇప్పటికే ఇందిర డెయిరీ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (మధిర విలేజ్ పేరిట) ఏర్పాటు చేసి, పరిశ్రమకు కావలసిన భూమిని సైతం అలాట్మెంట్ చేయించారు. రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో ఈ ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేసింది. ఈ ప్రాజెక్టు పట్ల సరైన అవగాహన లేకపోవడం, అమలు చేయాలన్న చిత్తశుద్ధి లోపించడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా నిర్లక్ష్యానికి గురైంది.
నియోజకవర్గ అభివృద్ధి పట్ల విజన్ ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క మల్లు తిరిగి ఈ ప్రాజెక్టును మధిరలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇందిర డెయిరీ ఏర్పాటు కావడం వల్ల నియోజకవర్గంలోని డ్వాక్రా సంఘాల్లో ఉన్న 53 వేల మంది మహిళలు పాడి పారిశ్రామికవేత్తలుగా ఎదగనున్నారు. నిత్యం 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేసే పరిశ్రమగా ఇందిర డెయిరీ ఏర్పాటుకు భారీ ప్రణాళికలను భట్టి విక్రమార్క రూపొందిస్తున్నారు.