ఎన్నికల కోడ్ ముగిసిపోయినందునా ఇక అధికారులు అభివృద్ధి పనుల అమలులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు
ప్రభుత్వ పథకాలు ప్రజల దరిచేర్చాలి
విధాత : ఎన్నికల కోడ్ ముగిసిపోయినందునా ఇక అధికారులు అభివృద్ధి పనుల అమలులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మధిర అభివృద్ధిపై అధికారులతో భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వసించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ మధిర అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలును పారదర్శకంగా, వేగంగా ప్రజలు అందించేలా అధికారులు జవాబుదారి తనంతో పనిచేయాలని కోరారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం కింద 2.84 కోట్ల మంది లబ్దిదారులున్నారని, 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 1402 ఆసుపత్రుల ద్వారా ఈ సదుపాయం కల్పించబడిందని, ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో వైద్య నిపుణుల సూచనల మేరకు 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
యాంజియోగ్రామ్, పార్కిన్సన్స్ సన్, వెన్నుపూసలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అమలు చేయని 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటితో పాటు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్లోఉన్న 98 చికిత్సా విధానాలను ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 189.83 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇది కాకుండా 65 కొత్త చికిత్సలను అంగీకరించడం వల్ల ప్రభుత్వం 158.20 కోట్లు ఖర్చు చేస్తుందని, పైన పేర్కొన్న సవరణల ఫలితంగా, కొత్త చికిత్సా విధానాలను చేర్చడం కోసం ప్రభుత్వం అదనంగా రూ.497,29 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.