ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా తీహార్ జైల్లో ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆమె తీహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు గత ఫిబ్రవరి 26న విచారణకు హాజరుకావాలని అంతకునాలుగు రోజుల ముందు సీబీఐ 41ఏ కింద నోటీస్లు జారీ చేసింది.
అనంతర పరిణామాల మధ్య కవితను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది. అంతకుముందు 2022డిసెంబర్ 11న కవితను సీబీఐ హైదరాబాద్లో విచారించింది. తాజాగా కవితను మరోసారి విచారించేందుకు కోర్టు అనుమతించడంతో తీహార్ జైల్లో ఉన్న ఆమెను సీబీఐ విచారించనుంది. బుచ్చిబాబు ఫోన్లో దొరికిన సమాచారం ఆధారంగా సీబీఐ కవితను ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల వ్యవహారంపై, కవిత కొనుగోలు చేసిన భూములపైన సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది. అలాగే ఈడీ సేకరించిన ఆధారాల మేరకు కూడా సీబీఐ ఆమెను ప్రశ్నించనుంది.
అటు ఈడీ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 8వ తేదీకి రిజర్వ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 20న చేపడుతామని కోర్టు వెల్లడించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయంపై తమ వద్ధ ఆధాలున్నాయని, మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని, గతంలో విచారణ దశలో కవిత సాక్షులపై ఒత్తిడి తెచ్చారని, ఆమెకు బెయిల్ ఇవ్వరాదంటూ ఈడీ తన వాదనలను బలంగా వినిపించింది. లిక్కర్ కేసులో ముడుపులు తరలించడం, పెద్ద ఎత్తున లబ్ధి, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, సాక్షులపై ఒత్తిడి చేయడం, మనీ లాండరింగ్, హవాల పద్దతుల్లో నగదు మళ్లింపు వంటి వాటికి సంబంధించి ఆధారాలున్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. గతంలో విచారణ క్రమంలో నిందితులంతా వంద ఫోన్ల వరకు ఫార్మాట్ చేసి సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ పేర్కోంది.