బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యంగాన్ని మారుస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్న మాటలు జోకర్ మాదిరిగా ఉన్నాయని, ఆయన మాటలకు విశ్వసనీయత లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
హామీల నుంచి దృష్టి మళ్లింపుకే ఆరోపణలు
విధాత, హైదరాబాద్ : బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, రాజ్యంగాన్ని మారుస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెబుతున్న మాటలు జోకర్ మాదిరిగా ఉన్నాయని, ఆయన మాటలకు విశ్వసనీయత లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు తక్కువ సీట్లు వస్తే ఎన్నికల అనంతరం తన సీఎం కుర్చీకి ఎసరు వస్తుందన్న భయంతో రేవంత్రెడ్డి బీజేపీ టార్గెట్గా దుష్ప్రచారానికి దిగాడన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకు రేవంత్రెడ్డి రిజర్వేషన్ల రద్దు..రాజ్యంగం మార్పు అంటు అడ్డగోలు ప్రచారం సాగిస్తున్నాడని విమర్శించారు. అసలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎవరు చెప్పారో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో లేని అంశాన్ని రేవంత్రెడ్డి చెబుతు బీజేపీపై బురదచల్లి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారన్నారు. అసలు రాజ్యంగాన్ని అత్యధిక సార్లు మార్చిన చరిత్ర కాంగ్రెస్కే ఉందని, 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎంత మంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించిందో చెప్పగలిగే దమ్ము మీకుందా అని రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. మోడీ పాలనలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ఇంత మంది బీసీలు ఉన్న కేబినెట్ కేంద్రంలో ఇదే మొదటిసారి అన్నారు. ఓ బీసీ వ్యక్తిని ప్రధాన మంత్రి కావడం, కేబినెట్ లో 12 మంది ఎస్టీలు, 8 మంది ట్రైబల్స్ ఉండటం బీజేపీ ప్రభుత్వంలో సాధ్యమైందన్నారు. మొట్టమొదటి సారిగా దళిత బిడ్డను, గిరిజన బిడ్డను రాష్ట్రపతులుగా చేసిన చరిత్ర బీజేపీదని గుర్తు చేశారు. గడిచిన పదేళ్లుగా లేని రిజర్వేషన్ల రద్ధు అంశాన్ని ఎన్నికల వేళ ఇప్పుడు చర్చకు తీసుకువచ్చి రేవంత్ రెడ్డి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రిజర్వేషన్ల రద్దు మా మ్యానిఫెస్టోలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయగా, హైదరాబాద్కు వచ్చిన ఆరెస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ రాజ్యంగంలోని అన్ని రిజర్వేషన్లకు సంఘ్ మద్దతు ఎప్పుడు ఉంటుందని, కొందరు ఈ అంశంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టతనిచ్చారని ఈటల గుర్తు చేశారు.
కాంగ్రెస్ హామీల అమలు అసాధ్యం
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420హామీలు మరో జన్మ ఎత్తినా అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఆర్ధిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో నేను ఇదే చెబుతున్నానని, ఇదే అభిప్రాయాన్ని ఆర్ధిక మంత్రిగా పనిచేసిన హరీశ్రావు కూడా చెబుతు రాజీనామా చాలెంజ్ చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ హామీల అమలు ఎలా సాధ్యమో ఆలోచించాలన్నారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్తో పోటీ లేదని భావించిన కాంగ్రెస్ ఇక బీజేపీతోనే పోటీ ఉందని గ్రహించి తమ పార్టీపై దుష్ప్రచారానికి దిగుతుందని విమర్శించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి నా గెలుపుపై చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, బీఆరెస్తో చీకటి ఒప్పందం చేసుకునే వ్యక్తిని తాను కాదన్నారు. తాను పోరాడి గెలిచే వ్యక్తినని, ఉద్యమకారుడినినని, ప్రజల మద్దతుతోనే గెలుస్తానని, మల్కాజిగిరి ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.