Harish Rao | జీవో 33ను ఉపసంహరించుకోవాలి: హరీశ్రావు
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33ను ప్రభుత్వం ఉపసంహరించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి టి.హరీశ్రావు డిమాండ్ చేశారు

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33ను ప్రభుత్వం ఉపసంహరించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి టి.హరీశ్రావు డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం హరీశ్రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల తలిదండ్రులు తమ పిల్లలకు జీవో 33ద్వారా ఎదురవుతున్న నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కొల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగేండ్ల నిబంధన వల్ల తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో స్థానికేతరులు కావడం బాధగా ఉందని వాపోయారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల స్వరాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. వారి ఆవేదనపై స్పందించిని హారీశ్రావు తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం చేసే 33 జీవోపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని, ఈ విషయంలో బీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించడానికి కొత్త విధానం రూపొందించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఒక హై లెవెల్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్స్ విషయంలో అన్యాయం జరగకుండా చూడాలన్నారు.