విద్యావ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం … సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు

విద్యావ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం … సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శాపంగా మారిన కాంగ్రెస్ పాలన
మన ఊరు మన బడి, సీఎం బ్రేక్ ఫాస్ట్ ఆపేశారంటూ ఫైర్‌

విధాత, హైదరాబాద్‌ : ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలు తెలంగాణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని విమర్శించారు. విద్యాశాఖ నిర్వర్తిస్తున్న మీరు, రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పా.. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల సమయంలో కొత్తగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు బీఆరెస్‌ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సన్నబియ్యానికి బదులు ముక్కిన బియ్యంతో భోజనం పెడుతున్నారని.. విద్యార్థుల పౌష్టికాహారం కోసం అందించే కోడి గుడ్ల బిల్లులు సైతం చెల్లించని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా ఒకే జత బట్టలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

ఒక్క విద్యార్థి కూడా ఆకలితో అలమటించవద్దనే మనవతా దృక్పథంతో గత ప్రభుత్వం 27వేల పాఠశాలల్లో ప్రారంభించిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. మరోవైపు సకాలంలో వేతనాలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాఠశాలల్లో దోమలు, ఈగలు ముసురుతున్నాయని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సిలబస్ ప్రకారం, పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుంటున్నది. పాఠశాల విద్యావ్యవస్థను ఇన్ని సమస్యలను చుట్టుముట్టినా మీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం బాధాకరమన్నారు. భావిభారత పౌరులను తయారుచేసే పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేయడం విద్యాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాలని బహిరంగ లేఖలో డిమాండ్‌ చేశారు.