Site icon vidhaatha

కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి

విధాత,హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికతో హాట్ టాపిక్‌గా మారిన రాజకీయ నేత పాడి కౌషిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ తరపున హుజురాబాద్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కౌషిక్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు ఫైల్ కూడా పంపించారు. అయితే గవర్నర్ తమిళి సై ఆ ఫైల్‌ను హోల్డ్‌లో పెట్టారు. తాజాగా ఆ ఫైల్ గురించి గవర్నర్ తమిళి సై మౌనం వీడారు. రాజ్‌భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక సేవకులకు, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే ఎమ్మెల్సీకి నామినేట్ చేయడం సరైనదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని, కౌషిక్ రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆగస్టు 1న జరిగిన కేబినెట్ భేటీలో కౌషిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆ వెంటనే అందుకు సంబంధించిన ఫైల్‌ను కూడా రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే అప్పటి నుంచి కౌషిక్ రెడ్డి ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఇక ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ఫైల్ పంపిన మరుసటి రోజే గవర్నర్ తమిళి సై ఆమోదించారు. రాజకీయ నేతగా ఉన్న కౌషిక్ రెడ్డి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు కాబట్టి ఆయనకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి లేనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version