Group-1 Results | అర్ధ‌రాత్రి గ్రూప్-1 తుది ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప్ 10 ర్యాంక‌ర్లు వీరే..

Group-1 Results | ఎట్ట‌కేల‌కు గ్రూప్-1( Group-1 ) తుది ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TGPSC ) బుధ‌వారం రాత్రి 12 గంట‌ల త‌ర్వాత తుది ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. మొత్తం 563 పోస్టుల‌కు గానూ 562 పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది టీజీపీఎస్సీ( TGPSC ).

Group-1 Results | అర్ధ‌రాత్రి గ్రూప్-1 తుది ఫ‌లితాలు విడుద‌ల‌.. టాప్ 10 ర్యాంక‌ర్లు వీరే..

Group-1 Results | హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు గ్రూప్-1( Group-1 ) తుది ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్( TGPSC ) బుధ‌వారం రాత్రి 12 గంట‌ల త‌ర్వాత తుది ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. మొత్తం 563 పోస్టుల‌కు గానూ 562 పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించింది టీజీపీఎస్సీ( TGPSC ). అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. తుది ఎంపికలో మల్టీజోన్‌-1లో 258, మల్టీజోన్‌-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. న్యాయవివాదం నేపథ్యంలో మరొక పోస్టును విత్‌హెల్డ్‌లో పెట్టింది. ఈ ఫలితాలు హైకోర్టులో విచారణలో కేసులపై వెలువడే తీర్పునకు లోబడి ఉంటాయని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

టాప్ 10 ర్యాంక‌ర్లు వీరే..

కాగా, గ్రూప్‌-1లో టాప్‌-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ వెల్లడించింది. హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన లక్ష్మీదీపిక గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షల్లో మొత్తం 900 మార్కులకుగాను 550 మార్కులతో మల్టీజోన్‌-2 కేటగిరీలో రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. ఉస్మానియాలో వైద్యవిద్య పూర్తిచేసిన ఆమె గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల్లో ప్రతిభ చూపించారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు.

రెండో స్థానంలో దాడి వెంకటరమణ, మూడో స్థానంలో వంశీకృష్ణారెడ్డి, నాలుగో స్థానంలో జిన్నా తేజస్విని, ఐదో స్థానంలో కృతిక, ఆరో స్థానంలో హర్షవర్ధన్, ఏడో స్థానంలో అనూష, ఎనిమిదో స్థానంలో నిఖిత, తొమ్మిదో స్థానంలో భవ్య, ప‌దో స్థానంలో శ్రీకృష్ణసాయి నిలిచారు.

ఇక మల్టీజోన్‌-1 కేటగిరీలో హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని టాపర్‌గా నిలిచారు. రాతపరీక్షల్లో 532 మార్కులు సాధించిన ఆమెకు ఆర్డీవో పోస్టు లభించింది. ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించి ఆర్డీవో పోస్టు సాధించారు.