Harish Rao | కమీషన్ల కోసం బకాయిలు విడుదల చేయడం లేదా?.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నది అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Harish Rao Vs Revanth Reddy

విధాత, హైదరాబాద్ :
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నది అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మీకు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా? వేదన వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతానని అంటున్న రేవంత్, మరో లక్ష కోట్లతో ఫోర్త్ సిటీ, వేల కోట్లతో అక్కరకు రాని చోట ఆరు లైన్ల రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు గ్రీన్ చానెల్‌లో పెట్టి క్లియర్ చేస్తున్న ప్రభుత్వం.. విశ్రాంత ఉద్యోగులకు మాత్రం రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్ విడుదల చేయడం లేదని హరీశ్ రావు విమర్శించారు.

‘కమీషన్లు రావడం లేదని విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం లేదా? నీకు ఆ మనసు లేదా?’ అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు నిలదీశారు. ‘30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెన్ ఫిట్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?’ అని ప్రశ్నించారు. సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుండటం అమానవీయం..అనైతికం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రిటైర్డ్ ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గం అన్నారు.

ప్రభుత్వం నిర్లక్ష్య పూరిత వైఖరి, పట్టింపులేని తనం వల్ల ఇప్పటికే అనేక మంది విశ్రాంత ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయారని హరీశ్ ఆరోపించారు. బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. దేశంలోనే విశ్రాంత ఉద్యోగులకు రూ.10,000 కోట్ల బకాయిలు పెట్టిన రాష్ట్రం ఏదీ లేదన్నారు. హక్కుగా తాము పొందాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని కల్పించిందని దుయ్యబట్టారు.

కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంత ఉద్యోగులకు అవిశ్రాంత పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించావని సీఎంపై ధ్వజమెత్తారు. ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చని జాబితాలో ఉద్యోగుల పీ ఆర్ సి, డీఏ‌లు కూడా చేరటం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు, 5 డీఏ ల జాడే లేదు, సీపీఎస్ రద్దు పై నాన్చివేత ధోరణి సరికాదని వెల్లడించారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పి, ఆచరణలో మాత్రం గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రెండు మూడు నెలల జీతాలు అందక ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Latest News