Harish Rao : పండుగల పేరుతో..దండుకోవడమేనా?

పండుగల పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

Harish Rao : పండుగల పేరుతో..దండుకోవడమేనా?

విధాత, హైదరాబాద్ : పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని ఎక్స్ వేదికగా విమర్శించారు. అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ.. ప్రయాణికులకు పెను భారంగా మారుతున్నది.

పండుగ సంబురం లేకుండా చేస్తున్నదని తప్పుబట్టారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన అని..ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి? అని హరీష్ రావు నిలదీశారు.

కాంగ్రెస్ ఇంజనీరింగ్ అమోఘం : హరీష్ రావు ఎద్దేవా

ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం..సాగు లక్ష్యాల మధ్య వైరుధ్యాలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మేడిగడ్డ టు మల్లన్న సాగర్ – మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లు ఎలా ఖర్చవుతాయంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరు అందించడం ఏమిటని నిలదీశారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 టీఎంసీలు మాత్రమేనట అని గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం ఏమిటని హరీష్ రావు తప్పుబట్టారు. రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి..కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం..అమోఘం అని, కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం అని..ఇది కదా అసలైన మార్పంటే? అని హరీష్ రావు విమర్శించారు.