Harish Rao : ఆరు గ్యారెంటీల లాగే బీసీ రిజర్వేషన్ల డ్రామా

ఆరు గ్యారెంటీల తరహాలోనే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతోందని హరీష్ రావు విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కొట్లాడాలని, పార్లమెంట్‌లో చట్టం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Harish Rao

విధాత : ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామా ఆడుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల ఉత్తర్వుపై హైకోర్టు స్టే జారీ చేయడం పట్ల హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ జాతీయ నాయకులతో డిల్లీ వేదికగా కోట్లాట పెట్టండి..కలిసి రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధం అన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు హైకోర్టు ఆదేశాలతో పటాపంచలయ్యాయని విమర్శించారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదు అని హరీష్ రావు ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్ల జీవోతో కొత్త నాటకం

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి..దీన్నీ తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు అని హరీష్ రావు విమర్శించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపాలని..మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలన్నారు. పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయండి. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. ఢిల్లీని నిలదీస్తుంది అని స్పష్టం చేశారు.