TELANGANA | తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం..హాజరైన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్రెడ్డి, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్రెడ్డి సహా మంత్రులు గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్గా ప్రమాణం చేసిన జిష్ణుదేవ్ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు కాగా.. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 1990లో బీజేపీలో చేరి క్రియాశీలకంగా పనిచేశారు. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్తు, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్గా రాష్ట్రానికి విచ్చేసిన జిష్ణుదేవ్ వర్మకు విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి, సీఎస్, డీజీపీలు స్వాగతం పలికారు.