విధాత : తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిపోగా..సోమవారం నుంచి పంచాయతీల్లో కొత్త సర్పంచ్ లు, పాలక వర్గాలు కొలువు తీరాయి. ఎన్నో హామీలతో గెలిచి సర్పంచ్ లుగా ఎన్నికైన వారు ఇప్పుడు తమ హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. కొందరు కోతుల బెడద నివారించేందుకు..మరికొందరు డ్రైనేజీలు, రోడ్లు, మంచినీటి వసతులు కల్పించేందుకు, ఇంకొందరు దేవాలయాలు కట్టించేందుకు అప్పుడే తమ కార్యాచరణ మొదలు పెట్టి ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో ఓ గ్రామపంచాయతీ కొత్త సర్పంచ్ మాత్రం బాధ్యతలు చేపట్టిన వెంటనే పాలకవర్గం తొలి సమావేశంలో అనూహ్యమైన వినూత్న నిర్ణయం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. మనిషి చనిపోతే అంత్యక్రియలు కూడా ఖరీదైన ఆర్థిక భారంగా మారిన నేటి రోజుల్లో బూరుగుపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైరల్ గా మారింది.
గ్రామ పంచాయతీ ద్వారా అంత్యక్రియలకు తీర్మానం
కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ దూలం కళ్యాణ్ తొలిరోజే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా తొలి పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నిరుపేదలకు అండగా నిలవాలనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Amaravti : అమరావతి ఆంధ్రుల రాజధాని..ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
Medaram : రేపు మేడారంలో దర్శనాలు బంద్
