బీఆరెస్ ప్రభుత్వ హయాంలో చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని, చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లేఖలో మండిపడ్డారు
మాపై బురద చల్లే దురుద్దేశంలో మీరు భాగం కావద్దు
విధాత: బీఆరెస్ ప్రభుత్వ హయాంలో చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా లేదని, చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లేఖలో మండిపడ్డారు. విచారణలో భాగంగా 15వ తేదీలోగా తనకు సమాధానం చెప్పాలన్న నరసింహారెడ్డి నోటీసులపై కేసీఆర్ స్పందిస్తూ కమిషన్కు 12పేజీల లేఖను పంపించారు. విద్యుత్తు విచారణ కమిషన్ ఛైర్మన్గా నరసింహారెడ్డి మాటలు ఎంతో బాధ కలిగించాయని కేసీఆర్ లేఖలో ఆక్షేపించారు. జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు పంపుదామని అనుకున్నానని, కానీ ఈలోపే మీరు ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా నా పేరు మీడియా ముందు ప్రస్తావించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే ఏదో దయతలచి సమయమిచ్చినట్లు మాట్లాడటం చాలా బాధ కలిగించిందని కేసీఆర్ పేర్కోన్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయని, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థ అవుతోందని, మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్లుగా మీ మాటలు ఉన్నాయని కేసీఆర్ తప్పుబట్టారు. విచారణ నిష్పక్షపాతంగా కనిపించడం లేదని, నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోందని, అందువల్ల ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ చివర్లో విజ్ఞప్తి చేశారు.
ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని కేసీఆర్ ప్రశ్నించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరూ(జస్టిస్ నరసింహారెడ్డి) ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకపోవడం విచారకరమన్నారు. కమిషన్ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే గత ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ చేసి అప్రతిష్ట పాలు చేసే దురుద్ధేశంతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు.
విద్యుత్తు కొనుగోళ్లు, ఫ్లాంట్ల నిర్మాణాల్లో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు. మీరు అన్ని అంశాలను పరిశీలించకుండా నాపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తప్పుపడుతూ అభ్యంతరాలను తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల కరెంటు సరఫరాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2014నాటికి సబ్ క్రిటికల్పై ఎలాంటి నిషేధం లేదు. 12వ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ ధర్మల్ ప్లాంట్ నిర్మించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టి తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చట్టబద్ధంగా అనుమతులు తీసుకునే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ ప్రారంభించామని కేసీఆర్ లేఖలో వివరించారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అప్పటి ప్రభుత్వంపై సీఎం రేవంత్రెడ్డి అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్తు రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదన్నారు. తెలంగాణ విద్యుత్తు పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని, అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగిందని తెలిపారు.
మా విజయలపై బురద చల్లె ప్రయత్నం
మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని. మా మార్పును తక్కువ చూపించేందుకే ప్రభుత్వ కమిషన్ ద్వారా ప్రయత్నాలు చేస్తుందని కేసీఆర్ ఆరోపించారు. ” విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89శాతం ఏపీకి 46.11శాతం విద్యుత్ కేటాయించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏ మాత్రం సరిపోదు. తెలంగాణ వచ్చే నాటికి 5వేల మెగావాట్ల కొరతతో రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామన్నారు.
రాష్ట్ర విభజన నాటికి 7,778మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్ను బీఆరెస్ ప్రభుత్వ విధానాలతో 20వేల మెగావాట్లకు పైగా తీసుకెళ్లామని, ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి అభ్యంతరాలు చెప్పారని గుర్తు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేసిందని, ఈఆర్సీ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఆనాడే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించినా వారు.. కానీ ఎలాంటి అప్పీల్కు వెళ్లలేదన్నారు.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆరెస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలపై బురద చల్లే పని పెట్టుకున్నాడని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో నల్లగొండ రంగారెడ్డి, మహబూబ్నగర్లలో విద్యుత్తు ఫ్లాంటు లేని కారణంగా యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ను దామరచర్లలో ఏర్పాటు చేశామని తెలిపారు.