Komatireddy : పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం

పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు దుష్ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి.

Komatireddy Rajgopal Reddy

విధాత : పార్టీ మారుతున్నానంటూ కొందరు మా కాంగ్రెస్ పార్టీ వాళ్లు..బీఆర్ఎస్ వాళ్లు కావాలని నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. రాజకీయంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతానన్నారు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దు అని ప్రజలను కోరారు. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానన్నారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హైకమాండ్ మాట ఇచ్చిందని..అందుకే తాను మంత్రి పదవి అడుగుతున్నానన్నారు. మంత్రి పదవి ఇస్తారో లేదో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని..ప్రస్తుతం మాత్రం నా లక్ష్యం కేవలం మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ఒక్కటేనని..ఇందులో మరో ఆలోచన లేదు అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం తన నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో, లక్కారం గ్రామంలో చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవలసిన చర్యలతో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్ చెరువు నుండి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరదనీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు రూ.500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపూదిద్దుకోబోతుందన్నారు.