KTR : జూబ్లీహిల్స్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం, కేటీఆర్ పార్టీ విజయానికి వ్యూహాలు ప్రకటించారు

KTR In Jubilee Hills By Election Campaign

విధాత, హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార సాధనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికపై పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో జరిగిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్‌తో చర్చించారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల్లో ఆగ్రహం

గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్‌గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల నష్టపోయాయని భావనలో ఉన్నాయని..ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించబోతుందన్నారు.