Komatireddy Venkat Reddy : కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదు
నల్లగొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు.

నల్లగొండ, విధాత: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో.. కక్ష సాధింపు రాజకీయాలకు తావులేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద విచారణల పర్వం కొనసాగుతుందని.. ఆ రిపోర్టుల ఆధారంగానే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా ఈ కార్ రేస్ వంటివాటిపై విచారణ సంస్థలే చర్యలు తీసుకుంటాయని, చట్టానికి ఎవరు అతీతులుకారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. 25 ఎకరాల్లో అధునాతన హంగులతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. అందులో 1లక్ష 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్నామని తెలిపారు.
దీంతో పాటు స్టాఫ్ క్వార్టర్స్, డైనింగ్ హాల్, ఇతర నిర్మాణ పుట్టింగ్స్ పనులు సమాంతరంగా జరిగేలా చూసుకుంటూ పనుల్లో ఇంకా వేగం పెంచాలనీ నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఎంతో మంది పేద విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ఈ రెసిడెన్షియల్ స్కూల్ దోహదపడనుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్రంలోనే నల్లగొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ఆదర్శంగా ఉండాలని, అందుకు అనుగుణంగా అధికారులు, వర్క్ ఏజెన్సీ మనసుపెట్టి పనిచేయాలని మంత్రి సూచించారు. 9నెలల నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.