మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ను తప్పుబడుతూ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు
మెట్రో ముసుగులో ఫ్రీ బస్పై అక్కసు
మంత్రి పొన్నం మండిపాటు
విధాత : మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ను తప్పుబడుతూ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. మెట్రో మనుగడ ముసుగులో ఈ పథకంపై మోదీ తన అక్కసు వెళ్లగక్కారన్నారు.
కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని, వాస్తవంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి..మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు. మెట్రో సెక్టార్ వేరని, ఇప్పటికీ కూడా మెట్రోలో బోగిలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచనతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి వ్యతిరేకంగా మాట్లాడారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.
ఇంకా రూట్లు పెంచి, కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయన్నారు. ప్రధాన మంత్రి మహిళలకు బస్సు సౌకర్యంపై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చద్దని హితవు పలికారు.