కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం ఏడాదికి 42 రోజులే పని కల్పిస్తున్నదని మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు
కుల, మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ
బిల్ట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం..
మంగపేట మండలాన్ని అభివృద్ధి చేస్తాం
ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ
ములుగు అభివృద్ధి నా బాధ్యత
బలరాం నాయక్ను గెలిపించే బాధ్యత మీది
రాష్ట్ర మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క
మంగపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజులు పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిందని కానీ ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం ఏడాదికి 42 రోజులే పని కల్పిస్తున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం మంగపేట మండలం బ్రహ్మణ పల్లి చెక్ పోస్ట్ నుండి ఏటూరు నాగారం వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్రాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదికి వంద రోజుల పని కల్పించడంతోపాటు గతంలో మాదిరిగానే పని ముట్లు అందిస్తామని చెప్పారు. ఉపాధి హామీ కార్మికులకు రోజుకూలి రూ.400 అందిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు భూములు పంచామని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చామని, ఉపాధి అవకాశాలు కల్పించి, పేదల పక్షాన నిలిచిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని చెప్పారు. బీజేపీ, బీఆరెస్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదేళ్లు పరిపాలించినా పేదలకు న్యాయం చేయలేదని విమర్శించారు. మోదీ సర్కార్ ఏ చట్టాలు తీసుకొచ్చినా.. బీఆరెస్ వాటికి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేస్తే.. మోదీ లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను తన మిత్రులకు కట్టబెట్టారని ఆరోపించారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టాలని సీతక్క పిలుపునిచ్చారు. ములుగు ప్రజలు బలరాంనాయక్కు తోడుంటే.. తాను మీకు అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.