బడ్జెట్పై కేసీఆర్ విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్
కేంద్ర బడ్జెట్పై చర్చకు ఎందుకు రాలేదని ప్రశ్న
విధాత : రాష్ట్ర బడ్జెట్పై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే కేసీఆర్ ఎoదుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ను విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీజేపీ ఒప్పందంలో భాగంగానే అసెంబ్లీ కి వచ్చిన మొదటి రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ టార్గెట్ చేశాడన్నారు. బీజేపీ మెప్పుకోసమే కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ ను విమర్శిస్తున్నారని, ఆరు నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావడమే అందుకు నిదర్శనమన్నారు.
కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఈ రోజు ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి, మీడియా పాయింట్కి వచ్చారని, తొందర్లోనే కోర్టు బోనులోకి వస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ను విమర్శించిన కేసీఆర్ ఊహల్లో విహరిస్తున్నారని, ఇంకా నేనే రాజు అనుకుంటున్నారని, గతంలో ఆయన పెట్టిన బడ్జెట్ ఎవరికి ఉపయోగపడలేదని విమర్శించారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకుందని కానీ గత ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు.. నిధులూ ఇవ్వలేదు.. ఇంక నియామకాల ఉసే కరువైందన్నారు.
అప్పులు చేసి తెలంగాణ ప్రజల జీవితాలపై వేశారని విమర్శించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజవరెడ్డి మాట్లాడుతూ వాస్తవానికి బడ్జెట్ దగ్గర ఉందని, అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదన్నారు. కేసీఆర్ తన అసమర్ధ పాలనతో కాళేశ్వరం ప్రాజెక్టును గంగలో కలిపారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఇప్పటికి పెండింగ్ బిల్లుల చెల్లింపు కష్టమైపోయిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి లక్ష రూపాయల రుణమాఫీ చేసి, 2లక్షల మాఫీకి సిద్ధమయ్యారన్నారు.
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరి అంకెల రూపంలో బడ్జెట్ పెట్టకుండా.. అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించామని, వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఒక్కో రంగానికి ఎన్ని డబ్బులు కేటాయిస్తున్నం అనేది విపులంగా వివరించామని, సంక్షేమం, అభివృద్ధి రెండు జరగాలని కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. గత బడ్జెట్లో కన్నా వైద్య విద్య కోసం ఎక్కువ కేటాయింపులు చేశారని, రూ. 9 వేల కోట్లు పైచిలుకు బడ్జెట్ పెట్టి.. వైద్య విద్యకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.
గతంలో కేసీఆర్ పాలనలో బడ్జెట్ పేపర్లకు పరిమితం అయ్యిందని విమర్శింంచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది రైతు బడ్జెట్ అన్నారు. తెలంగాణ వచ్చిన పదేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులు అని డబ్బులు తగలేసి, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు.. త్రాగు నీటి సదుపాయాలు లేకుండా చేశారన్నారు. స్కూల్స్లో టీచర్స్ లేకుండా చేశశారని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ బడ్జెట్లో వైద్య, విద్య రంగాలకు నిధులు కేటాయింపు చేయడం జరిగిందని,. జాబ్ క్యాలెండర్ కూడా పెట్టడం జరిగిందని, సెప్టెంబర్ 5, 6 లోగా గ్లోబల్ మేథోసంపత్తి కోసం స్కిల్ యునివర్సిటీ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపిందన్నారు.