ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను డిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. తనకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించడాన్ని హైకోర్టులో కవిత సవాల్ చేసింది
ఢిల్లీ హైకోర్టు నిర్ణయం
విధాత : ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను డిల్లీ హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. తనకు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించడాన్ని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కేసు వాస్తవాలు పరిశీలించి తనకు బెయిల్ ఇవ్వాలని పిడిషన్లో కవిత కోరింది.
అలాగే తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, చికిత్స అవసరమని కోరింది. తాను జైల్లో ఉండడం వల్ల తన మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్లో తెలిపింది. 1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మసనం కవిత బెయిల్ పిటిషన్ పరిశీలించి ఈ నెల 24కు విచారణ వాయిదా వేసింది.
అంతకుముందు కవిత రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కావేరీ బవేజా ధర్మాసనం తిరస్కరిస్తూ ఈ నెల 6న తీర్పు వెలువరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మార్చి 15వ తేదీన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.
నాటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. న్యాయస్థానం పలుమార్లు ఆమె జ్యుడీషియల్ రిమాండ్ను పొడిగించింది. ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేశారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ లభించకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణపై ఆసక్తి నెలకొంది.